ఆయన బీసీలకు నాయకుడు. ఆయన గళం విప్పితే.. అధికార పార్టీలకు చెమటలు పట్టాల్సిందే. ఒకప్పుడు ఆయన కోసం ఎదురు చూసిన, ఆయ న అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూసిన పార్టీల అధినేతలు ఉన్నారు. ప్రభుత్వాలు సైతం ఆయనతో చర్చించే కొన్ని నిర్ణయాలు తీసుకునేవి. అంత కీలక నేత కూడా తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే, మునుపటి పటిమ ఆయన కోల్పోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రభ తగ్గిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయనెవరంటే.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. 2014కు ముందు ఆయన ఓ ప్రభంజనం. ఆయన చేసే ప్రతి ప్రకటనా ఎంతోఅమూల్యం. పార్టీలు చెవులు రెక్కించి మరీ వినేవి. ఆయన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం కూడా ఇచ్చేవి.
అయితే, ఆయన 2014లో రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. అది కూడా టీడీపీలోకి చేరి తెలంగాణాలోని ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. బీసీల దన్నుతో ఆయన అఖండ విజయం సాధించి గెలుపొందారు. తర్వాత నిజానికి తెలంగాణాలో టీడీపీ తరఫున గెలుపొందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార టీఆర్ ఎస్లోకి జంప్ చేసినా.. కృష్ణయ్య మాత్రం పార్టీ నుంచి తటస్థ వైఖరిని అవలంబిస్తూనే ఇతర ఏ పార్టీలోకీ వెళ్లలేదు. అదేసమయంలో ఏపీ సీఎంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలను ఆయన అవకాశం దొరికినప్పుడల్లా విమర్శించారు. ప్రతి విషయాన్నీ.. ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇక, ఎన్నికలకు ముందస్తు తెరదీసిన నేపథ్యంలో ఇప్పుడు కృష్ణయ్య.. టీడీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తనకు మళ్లీ ఎల్బీనగర్ సీటును కేటాయించాలని ఆయన కోరినా పార్టీ ఈప్రతిపాదనను పక్కన పెట్టింది.
అదేసమయంలో ఆయనను అత్యంత కీలకమైన మరో నియోజకవర్గం అదికూడా వికారాబాద్ లోని తాండూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తనను కాంగ్రెస్ తరఫున అక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీ అధిష్ఠానం కోరుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను ఈసారి కూడా ఎల్బీ నగర్ నుంచే పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు కృష్ణయ్య తెలిపారు.
అయితే తాండూరుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, పార్టీ కోరిక మేరకు అక్కడినుంచి పోటీ చేసే విషయం పైనా ఆలోచిస్తానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం టికెట్లను బీసీలకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. నిజానికి బీసీ సంక్షేమ సంఘంఅధ్యక్షుడిగా ఆయన అనేక విజయాలను నమోదు చేశారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయనకు తాండూరు కేటాయించడం వెనుక వ్యూహం ఏదో ఉందని అంటున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో తాండూరులో టీఆర్ ఎస్ విజయమే ఖాయమని అంటున్నారు. మరి కృష్ణయ్య ఎలా నెగ్గుకు వస్తారో చూడాలి.