తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబునాయుడు తమ్ముళ్ళకు షాక్ ఇచ్చేశారు. ఇంతకాలం ఆశపెట్టుకున్న వారి గాలి తీసేసేలా పెద్ద బాంబే పేల్చారు. పార్టీ ముఖ్యం, అంతకంటే ముందు గెలుపు ముఖ్యం. ఆ తరువాతే ఏదైనా అంటూ చంద్రబాబు సూక్తిముక్తావళి చదవడంతో తమ్ముళ్ళకు హై బీపీ వస్తోంది. ఈ పేరు చెప్పి ఎవరికి టిక్కు  పెడతారోనని తెగ కంగారు పడుతున్నారు.


అదే ప్రాతిపదిక :


నేను గెలుపులోనే పార్టీని చూస్తాను, గెలిచే వారినే చేరదీస్తాను ఇదీ చంద్రబాబు లేటెస్ట్ స్లోగన్, అలా కాకుండా అడిగారని టికెట్ ఇచ్చుకుంటూ పోతే పార్టీ గల్లంతవుతుంది. పార్టీయే మనకు బలం, పార్టీ ఉంటేనే అంతా ఇక్కడ ఉన్నాం, ఇది గుర్తుపెట్టుకోండంటూ బాబు ఇస్తున్న లెక్చర్లకు తమ్ముళ్ళకు బుర్ర తిరిగిపోతోంది. అసలు టికెట్లు ఎవరికి ఇస్తారు, బాబు మనసులో ఏముందన్నది తెలుసుకోవడానికి తమ్ముళ్ళు నానా తంటాలూ పడుతున్నారు.


సర్వేల పేరిట హంగామా :


మరో వైపు చంద్రబాబు సర్వేల పేరిట చేస్తున్న హంగామ కూడా తమ్ముళ్ళకు గుండె దడ పుట్టిస్తోంది. సర్వే పేరు, గెలుపు అవకాశాలు చెప్పి ఈ తడవ సగానికి పైగా సిట్టింగులకు ఫిట్టింగ్ పెట్టేందుకు బాబు తయారైపోతున్నారని అంటున్నారు. మరో వైపు సీనియర్ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి లాంటి వారు కూడా బాబు మంచోడే, ఎమ్మెల్యేలే చెడ్డవాళ్ళు అంటూ ఈ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు. బాబు వారిని తప్పిస్తే మళ్ళీ సీఎం అవడం ఖాయమని జేసీ సూత్రీకరించారు కూడా.


ఫిరాయింపులకూ బెంగ :


ఇక వైసీపీని వీడి టీడీపీలో చేరిన రెండు పదులను మించి ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలలోనూ గుండె దడ పట్టుకుంది. అసలు తమ్ముళ్ళకే మంగళం పాడేస్తే కొసరు వాళ్ళం మాకేం మిగులుతుంది ఏడుపు తప్ప అంటున్నారు. బాబు మరో వైపు ఇతర సర్వేలను కూడా పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేలే చెడ్డ అన్న ముద్ర వేసేందుకు చూస్తున్నారని తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు. మొత్తానికి చూసుకుంటే మాత్రం టీడీపీ మరో మారు గెలవాలన్న నెపంతో చాలా మందిని బలి చేసేటట్లుగా వ్యవహారం నడుస్తోందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: