ఆర్థిక రాజధాని విశాఖపట్టణానికి బుధవారం రాత్రి భారీగా చేరుకున్న ఐటీ అధికారులు, గురువారం ఉదయం తమ పనిని ప్రారంభించారు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మరోసారి తనిఖీలు చేపట్టినట్లే. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సుమారు 50వాహనాల్లో అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాలకు తనిఖీల నిమిత్తం బయలుదేరి వెళ్లారు. దువ్వాడ సెజ్ లోని పలు గోదాముల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు లాజిస్టిక్ రంగంలో భారీ కంపెనీ గా ఉన్న టీజీఐ లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ సంస్థ తెలంగాణ తెదేపా నేత దేవేందర్గౌడ్ బంధువులకు చెందినట్లు తెలుస్తోంది. ఎగుమతులకు సంబంధించి ఆదాయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు ఈ సంస్థపై దృష్టి సారించినట్లు సమాచారం.ఇప్పటికే కొంతమంది అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులకు బయలుదేరారు. గురువారం ఉదయం గాజువాక మండలం దువ్వాడ ఎస్ఈజెడ్ లోని పలు సంస్థల్లో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. లాజిస్టిక్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న టీజీఐ లో ఎనిమిది మంది అధికారులతో కూడిన బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు చెందిన గొడౌన్ల లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
తెలంగాణ టీడీపీ నేత దేవేందర్గౌడ్ బంధువులకు చెందిన టీజీఐ సంస్థలో ఎగుమతులకు సంబంధించి ఆదాయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం రావడం తో ఐటీ అధికారులు ఈ సంస్థపై దృష్టి సారించారు. అలాగే 'ట్రాన్స్ వాల్ట్ బీచ్ శాండ్ సంస్థ' లోకి కొందరు అధికారులు ప్రవేశించారు. ఆక్వా కంపెనీలు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు, స్టార్ హోటల్ యజమానులు, నగల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరగవచ్చని తెలుస్తోంది. విశాఖ నగరానికి ఐటీ అధికారులు భారీగా చేరు కోవడంతో అధికార పార్టీ నేతలు, వ్యాపారవేత్తల్లో కలవరం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోపక్క, వీటిని కవర్ చేయడానికి మీడియా వాహనాలు ఐటీ ఆఫీస్ ముందు బారులు తీరాయి.
ఎంవీపీ కాలనీలోని ఒక ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ నివాసం లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆరిలోవ కాలనీ లోని జీఎస్టీ కార్యాలయంలోనూ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. శ్రీకాకుళంజిల్లా గార పరిసర ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు సోదాలునిర్వహిస్తోన్నట్టు సమాచారం. స్థానికఅధికారులకు గురువారం ఉదయం వరకు దాడులకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. మరోవైపు తమిళనాడులోని 10 0కి పైగా ప్రాంతాల్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి.
ఆర్థికంగా, పారిశ్రామికంగా విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో కొందరు పన్ను సరిగా చెల్లించడం లేదన్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ శాఖాధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల ప్రచారం వివిధ రాజకీయ పక్షాల్లో కీలకంగా ఉన్నవారిలోనూ అలజడి రేపుతోంది.