ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్టణం విమానాశ్రయం లో జరిగిన దాడి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరియు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి జగన్ వీరాభిమాని అంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే ఓ వర్గం మీడియా తెగ హోరెత్తిస్తున్న క్రమంలో మరో పక్క దాడిచేసిన వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ముఖ్యంగా జగన్ పై దాడి జరుగుతున్న సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బియ్యపు మధుసూదన్రెడ్డి జగన్ పక్కన ఉండడంతో దాడి జరుగుతున్న సమయంలో వెంటనే అప్రమత్తమైన క్రమంలో జగన్ తప్పించుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో జగన్ పక్కనే ఉన్న విశాఖపట్టణం జిల్లా అధ్యక్షుడు మల్ల విజయప్రసాద్ అసలు జరిగిన దాని గురించి మొత్తం చెప్పారు.
అయన మాటలను బట్టి వెయిటర్ శ్రీనివాస్ లాంజ్ లో వాటర్ బాటిల్ పట్టుకొని జగన్ దగ్గర గా నిల్చొని ఉన్నాడని, అదే సమయం లో బియ్యపు మధుసూధన్ రెడ్డి విజయవాడ కి చెందిన నాయకుడ్ని జగన్ పరిచయం చేయడానికి జగన్ దగ్గరకు వచ్చాడని, సరిగ్గా అదే సమయం లో శ్రీనివాస్ తన దగ్గరున్న కత్తి తో జగన్ ను పొడిచే ప్రయత్నం చేసాడని, ఆ సమయం లో బియ్యపు మధు జగన్ ని పిలవటం తో జగన్ కుడి పక్కకు తిరిగారని దాంతో కత్తి ఎడమ బుజం కింది భాగం లో తగిలిందని చెప్పారు.
ఆ క్షణంలో జగన్ అలా తిరగకపోయి వుంటే కత్తి శరీరంలో ప్రమాదకరమైన స్థానంలో పడి ఉండేదని విజయ ప్రసాద్ చెప్పారు. మరియు అదేవిధంగా జగన్ పై దాడి గురించి డీజీపీ హోంమంత్రి చేస్తున్న కామెంట్లు చాలా నీచంగా ఉన్నాయని..జరిగిన ఘటనను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆరోపించారు.