ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముప్పేట రాజకీయాల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరౌతుంది. ఒకవైపు అధికార తెలుగుదేశం, మరోవైపు ప్రతిపక్ష వైసిపి, ఇంకోవైపు ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయాల్లొకి వచ్చానని చెప్పుతున్న సినీ నటుడు పవన్ కళ్యాన్ జనసేన. ఇక్కడ కాంగ్రెస్ గాని బిజెపి గాని తమ అస్థిత్వాన్ని కోల్పోయి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించ స్థితిలో ముక్కి మూల్గుతున్నాయి. అయితే ....
శ్రీకాకుళంజిల్లా ప్రజలు "తిత్లీ తుఫాను" కారణంగా తీవ్రంగా నష్టపోయారు, సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు, భారీగా ఆస్తి, పంట, పశు నష్టం సంభవించింది. కనీవిని ఎరుగని రీతిలో తిత్లీ తుఫాను సిక్కోలును నష్టపరిచింది. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. స్వయంగా తుఫాను బాధిత ప్రాంతా ల్లో పర్యటిస్తూ ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కూడా ఇప్పటికే సిక్కోలులో ప్రకృతి ప్రకోపానికి గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన తరఫున సహాయక చర్యలకు చేపట్టేందుకు ఆయనొక ప్రణాళిక రూపొందించారు. సిక్కోలు ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.
ఇక మిగిలింది ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి. తుఫాను బాధితులను పరామర్శించేందుకు ఇంతవరకు ఆయన రాలేదు. అయితే ప్రతినిధులుగా ఆయన పార్టీకే చెందిన ధర్మాన ప్రసాదరావు బృంధం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పర్యవ్రేక్షిస్తూనే ఉంది. అయినా అధికారపక్షం అధినేత వైఎస్ జగన్మోహనరెడ్దిని టార్గెట్ చేసింది అధికార టిడిపి. తుఫాన్ బాధితులను పరామర్శించే కనీస తీరిక కూడా ప్రతిపక్షనేత జగన్ కు లేదా? అని విమర్శలు చేయడం మొదలు పెట్టింది. కావాలని జగన్మోహనరెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేసింది.
తనపై వస్తున్న విమర్శలపై వైఎస్ జగన్ స్పందించారు. విజయనగరం జిల్లా సాలూరు లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, జగన్.. తిత్లీ తుఫాన్, ఆ తర్వాతి పరిణామాలపై స్పందించారు. వారం రోజుల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళతానని, శ్రీకాకుళం జిల్లాలో 50రోజుల పాటు ఉంటానని ప్రకటించారు. అంతవరకు మా పార్టీ ప్రతినిధుల బృందం ఆ బాధ్యత చూసుకుంటారని అంటూ,
"నేను శ్రీకాకుళం ఎందుకు వెళ్లలేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఈ మాటలకు నవ్వాలో? ఏడవాలో? అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబా? నేనా?" అని జగన్ ప్రశ్నించారు.
" రాష్ట్ర ఖజానా నీ వద్ద ఉందా? నా వద్ద ఉందా? అధికార యంత్రాంగం నీ వద్ద ఉందా? నా వద్ద ఉందా?" అంటూ ప్రజా సమక్షంలో జగన్ ముఖ్యమంత్రి చంద్ర బాబును నిలదీశారు. పాదయాత్రలో ఉన్నాను. కాబట్టి, తమ పార్టీ నేతలు బాధితుల తరఫున నిలబడి సహాయక చర్యలు చేపడుతున్నారని జగన్ వివరించారు.
తిత్లీ పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. ప్రకృతిని హ్యాండిల్ చేశానని, తుఫాన్ను జయించానని గొప్పలు చెప్పుకుంటున్నారని చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సరైన ముందస్తుచర్యలు చేపట్టలేదని జగన్మోహనరెడ్ది ఈసందర్భంగా విమర్శించారు. కనీసం తాగు నీటిని కూడా సరఫరా చేయలేక పోయారన్నారు. తాగునీటి కోసం బాధితులు చంద్రబాబును నిలదీశారని, ఆయన వారిని కూడా బెదిరించారని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు బాధితుల అండగా నిలబడితే, ప్రతిపక్షం సహాయ కార్యక్రమాలు అడ్డుకుంటుందని బురద జల్లడం ఏమిటి? అని ప్రశ్నించారు.
తిత్లీ తుఫాన్ ప్రభావంతో ₹3435 కోట్ల నష్టం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెబుతున్నారని, ఆ నష్టాన్ని ఆయనే అధికారంలో ఉన్నందున భర్తీ చేయా లని జగన్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేయని పక్షంలో, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పని తాము చేయగలని ఆయన పేర్కొన్నారు.