జగన్ మీద జరిగిన దాడిని చంద్ర బాబు రాజకీయ కోణం లో లభ్ది పొందాలనుకోవడం చూస్తుంటే బాబుకు మానవత్వం ఉందా అని అనుకుంటారు. అయితే జగన్ మీద దాడిని పవన్ కళ్యాణ్ ఖండించడం కూడా తప్పన్నట్టు టీడీపీ నాయకులూ మరియు చంద్ర బాబు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి స్పందన ఇంత దారుణంగా వుండడాన్ని ఎవరూ స్వాగతించలేని పరిస్థితి. టీడీపీ అధినేతగా కూడా చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుండకూడదు. కానీ, ఆయన 'నిప్పు' నారా చంద్రబాబునాయుడు.. ఆయన స్పందన ఇంతకంటే భిన్నంగా వుంటుందని ఎలా ఆశించగలం.?
ఇక, చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్లో రంకెలేసిన వైనంపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రిగారు, ఆయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారెందుకు.? అని ప్రశ్నించారు పవన్కళ్యాణ్. జరగకూడని ఘటన జరిగిన తొలి రోజున, సంయమనం పాటించాలన్న కనీస విజ్ఞతను అధికార పార్టీ మర్చిపోయింది. ముఖ్యమంత్రి, మంత్రులు, చివరికి డీజీపీ సైతం ఈ విషయాన్ని 'లైట్'గా తీసుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, విపక్షాలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ అభాసుపాలైపోయింది.
చంద్రబాబు అనుమానాల సంగతేమోగానీ, పవన్ - జగన్ కలిస్తే.. 'కుక్క కాటుకి చెప్పుదెబ్బ' అనేస్థాయిలో సమాధానం చెప్పినట్లవుతుందన్న భావన ఇటు వైసీపీ శ్రేణుల్లోనూ అటు జనసేన శ్రేణుల్లోనూ కలిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికైతే జనసేన - వైసీపీ 'ఎడమొహం పెడమొహం' అన్నట్లుగానే వున్నాయి. జగన్ మీద వీలు చిక్కినప్పుడల్లా పవన్ వెటకారాలు చేయడం, పవన్ పెళ్ళిళ్ళ వ్యవహారంపై జగన్ కామెంట్లు చేయడం.. అలా ఈ రెండు పార్టీల మధ్యా వైరం తప్ప, ఏనాడూ స్నేహం లేదాయె. చంద్రబాబు పుణ్యమా అని ఆ స్నేహం ఇరుపార్టీల మధ్యా కుదురుతుందేమో.!