అంబటి రాంబాబు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో విజయం దక్కించుకోలేకపోయిన నేత. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన(నియోజకవర్గం మారి) ప్రస్తుత స్పీకర్ కోడల శివప్రసాద్ విజయం సాధించారు. దీంతో అంబటి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది కీలకమైన ఎన్నిక ల్లో ఆయన విజయం సాధించేందుకు ఉన్న పరిణామాలను భేరీజు వేసుకుంటున్నారు. సత్తెనపల్లిలో జరుగుతున్న అధికార పార్టీ నేతల అవినీతిపై ఆయన ఇప్పటికే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అదేసమయంలో ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా స్పందిస్తున్నారు.
ప్రభుత్వం పైనా, సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లపై అంబటి ఎప్పటికప్పుడు విమర్శలు సంధిస్తూనేఉన్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంత సేపూ మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడమేనా? క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండేది ఎప్పుడు? ఎన్నికలకు కనీసం ఆరు నెలలుకూడా టైం లేదు. ఏం చేస్తున్నావు? అంటూ వైసీపీ అధినేత జగన్.. విశాఖకు పిలి పించుకుని మరీ అంబటికి క్లాస్ ఇచ్చారు. దీనిని బట్టి అప్పట్లోనే ఇక, అంబటి పని అయిపోయిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ఇక, అంబటికి టికెట్ కూడా కష్టమేననే వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై వెంటనే స్పందించిన అంబటి నియోజకవర్గంలో తిరిగేందుకు, కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే, ఇప్పుడు ఉరుములు లేని పిడుగులా ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం తాజాగా విశాఖ ఎయిర్ పోర్టులో జగన్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆయనపై శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కోళ్లకు కట్టే కత్తిని వినియోగించి దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన జగన్.. ప్రాధమికంగా విశాఖ ఎయిర్ పోర్టులోనే చికిత్స పొంది.. తర్వాత హైదరాబాద్కు వెళ్లిపోయారు. అక్కడ గాయం తీవ్రం కావడంతో ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే, ఇక్కడ జగన్కు చికిత్స చేసిన డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఈయన కూడా వైఎస్ ఫ్యామిలీకి ఆత్మీయుడు కావడం గమనార్హం. ఈయన కూడా సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా నియోజకవర్గంలో సాంబశివారెడ్డి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వైద్య సేవలు అందిస్తున్నారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం, చల్లగుండ్ల గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి చిన్న వయసులోనే వైద్య వృత్తిలోకి ప్రవేశించారు. ఇక, సాంబశివారెడ్డి ఫ్యామిలీకి రాజకీయాలు కొత్తకాదు. ఆయన తాత బూచిపూడి సుబ్బారెడ్డి గతంలో కాంగ్రెస్లో కీలక నాయకుడిగా వ్యవహరించారు. 1983లో నరసరావుపేట నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కోడెల శివప్రసాద్పై ఓడిపోయారు. కట్ చేస్తే.. ఆ నాడు తన తాతను ఓడించిన కోడెలపై కసి తీర్చుకునేందుకు డాక్టర్ సాంబశివారెడ్డి ప్రతిజ్ఞ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. కొసమెరుపు ఏంటంటే.. జగన్.. తన గాయానికి చికిత్స ఈ డాక్టర్ వద్దే చేయించుకోవడం!!