అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకురాలు మంత్రి పరిటాల సునీత వైసిపి అధినేత ప్రతిపక్ష నేత జగన్ పై సంచలన కామెంట్ చేశారు. తాజాగా ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడి నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత.
2019 ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ కావాలనే కత్తితో పొడుచుకుని..రాష్ట్ర ప్రజల దృష్టిలో పెద్ద ప్రమాదంగా చిత్రీకరించారని..సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. గతంలో వైయస్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో తన భర్త పరిటాల రవి ని పట్టపగలే హత్య చేశారని ఆరోపించారు సునీత.
అప్పుడు తన భర్త ఎమ్మెల్యేగా చనిపోతే నాటి గవర్నర్ వచ్చి పలుకరించలేదని.. చంద్రబాబు ఒక్కరే తమను ఆదుకున్నారని సునీత తెలిపారు. ఇక జగన్ మూడువేల కిలో మీటర్లు పాదయాత్ర చేసినా తనకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని.. అయితే ఎయిర్పోర్టులో జగన్ పై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుందని సునీత ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పై జరిగిన దాడిని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని..రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ పార్టీ నాయకుల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సునీత.