రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా నెల్లూరు. ఇక్కడ నుంచి ఎంతో మంది మేధావులు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు. ఇక, అధికార పార్టీ టీడీపీ కూడా ఇక్కడ గతంలో కొన్నాళ్లు చక్రం తిప్పినా, రానురాను కాంగ్రెస్ హవా ముందు నత్తనడక తప్పలేదు. ఇక, ఇప్పుడు వైసీపీ దెబ్బకు మరింతగా దిగజారి పోయింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. టీడీపీ పరిస్థితి దారుణంగానే ఉండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రభంజనం సృష్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఎన్నికల వేళలో టికెట్ల కోసం నాయకుల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. మాకు కావాలంటే.. మాకు కావాలని నాయకులు పోటీ పడుతున్నారు.
కొత్తవాళ్ల అరంగేట్రం.. కొత్త చిక్కులు జిల్లా నాయకత్వానికి ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసిన జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు టీడీపీలో చేరు విషయం నేటికీ సస్పెన్స్గానే ఉంది. బొమ్మిరెడ్డి ఆత్మకూరు టికెట్టు కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై నే జగన్తో ఆయన విభేదించారు. అయితే టీడీపీ ఇప్పటికే ఇక్కడి నుంచి బొల్లినేని కృష్ణయ్యను అధిష్ఠానం రంగంలోకి దింపింది. ఇప్పుడు ఆయన్ను కాదని బొమ్మిరెడ్డికి టికెట్టు ఇవ్వడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. ఆత్మకూరు లేకున్నా నెల్లూరు పార్లమెంట్ లేదా మరేదైనా స్పష్టమైన హామీ ఇస్తే బొమ్మిరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు సైతం స్పష్టమైన హామీ ఇస్తేనే పార్టీలో చేరుతానని తేల్చి చెప్పినట్లు తెలిసింది. వీరిద్దరు అధినేత చంద్రబాబు వద్ద నుంచి హామీ పొందిన తరువాత పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరిని అధినేత వద్దకు తీసుకెళ్లడంలో అసాధారణ జాప్యం జరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. జిల్లా నాయకుల నిర్లక్ష్యం కారణంగా గతంలోనూ ఇదే తరహాలో ముఖ్యమైన నాయకులను చేజార్చుకున్నారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి సైతం ఆత్మకూరు టికెట్టును ఆశిస్తు న్నారు. అది కాని పక్షంలో నెల్లూరు రూరల్, కుదిరితే నెల్లూరు పార్లమెంట్ టికెట్టు ఇవ్వాలని పార్టీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు.
నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి కన్నబాబు తనకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే నిరాదరణ కొనసాగితే మరోదారి చూసుకుంటానని జిల్లా నాయకులకు అల్టిమేటం ఇస్తున్నారు. నిజానికి ఈ నాయకులతో పార్టీ అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భావించారు. కానీ, ఆత్మకూరులో కొత్త చిక్కులు ఎదురుకావడం తాజా పరిణామం. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా నియోజకవర్గ పరిధిలో జరగాల్సిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఒక్కటి కూడా జరగకపోవడంతో ఇక్కడ రాజకీయంగా పరిస్థితి తారుమారయ్యేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు మరి ఏం జరుగుతుందో చూడాలి.