తెలంగాణాలో అదికార పార్టీ టీఆర్ ఎస్.. దాదాపు 105 మందితో తొలి జాబితా ప్రకటించింది. అయితే, మిగిలిన పార్టీలు మహాకూటమిగా ఏర్పడినా.. టికెట్లు పంచుకున్నాఅభ్యర్థుల ప్రకటన మాత్రం ఆపివేశాయి. దీంతో అసెంబ్లీని రద్దు చేసి టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినప్పడు ఉన్న ఉత్సాహం కాలక్రమేణా తగ్గుతోంది. ఎన్నికల యుద్ధంలో ఎవరితో పోరాడాలో తెలియని స్థితిలో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించ లేదు. రాష్ట్రంలో ఒకింత బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఎవరికి సీటిస్తుందోనని ఆ పార్టీ ఆశావహుల్లో ఉన్న టెన్షన్ కన్నా రంగంలో ఉన్న టీఆర్ ఎస్ అభ్యర్థుల టెన్షనే ఎక్కువవుతోంది.
దీనికితోడు ఎన్నికలకు నెలన్నర రోజుల క్రితమే టికెట్లను ప్రకటించ డంతో అభ్యర్థుల వద్దకు నాయకుల, కార్యకర్తల తాకిడి పెరిగింది. ప్రచారం కోసం జనాలను తీసుకురావడానికి, భోజన వసతి ఏర్పాటు చేయడానికే ప్రతిరోజు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక యువజన, కుల సంఘాలు, మహిళా గ్రూపులు, ఇతర పార్టీల నాయకులు బేరాలకు దిగుతుండడంతో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నా, ఈ ప్రభావం అంతగా లేదు. సీటు తమకే అనే నమ్మకం తో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు అధికారికంగా తమకు సీటు కేటాయించిన తరువాత ‘చూసుకుంటాం’ అనే మాటలతో తప్పించు కుంటు న్నారు. కానీ, అధికార పార్టీ అభ్యర్థి అనేసరికి మాత్రం ఈ ఖర్చు మరింతగా పెరిగిపోయింది.
అధికారంలో ఉన్న నాయకులు ముఖ్యంగా సిట్టింగు లకు టీఆర్ ఎస్ అదినేత టికెట్ ఇవ్వడంతో సాధారణంగానే కార్యకర్తలు కేడర్ కూడా ఈ నాలుగేళ్లలో సంపాయించింది చాలానే ఉంటుందనే అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణాలోను ఉమ్మడి ఏపీలోనూ ఉన్న సౌలభ్యం ఏంటంటే.. దేశంలోపార్లమెంటు ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమ యంలో వచ్చేవి. అంటే.. అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతుండడంతో ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఒకింత ఆర్థికంగా సాయం చేసేవారు. నియోజకవర్గానికి ఇంత అని ప్రచారం కింద ఇచ్చేవారు. పలితంగా అసెంబ్లీ కి పోటీ చేసేవారికి ఈ సొమ్ము కొంత వరకు వేణ్నీళ్లకు చన్నీళ్ల మాదిరిగా ఉపయోగపడేది.
కానీ, ఇప్పుడు తెలంగాణాలో ముందస్తు ముచ్చటకు తెరలేవడంతో పార్లమెంటు అభ్యర్థులు ఇప్పుడు ఖర్చు నుంచి తప్పించుకున్నారు. ఫలితంగా ఎమ్మెల్యే అభ్యర్థులపైనే మొత్తం ఖర్చంతా పడుతోంది. పైగా అదికార పార్టీ వారంటే.. ప్రతి పనికీ.. డబుల్ రేటు కడుతున్నారు. దీంతో అభ్యర్థులు సతమతమవుతు న్నారు. పార్టీ నుంచి కొంత మేరకు ఫండింగ్ ఉన్నా.. అది ఏమూలకూ సరిపోవడం లేదు. వివిధ వర్గాల నుంచి అందే సాయంపైనైనా ఆశలు పెట్టుకుందామా? అంటే.. మహాకూటమి అభ్యర్థిని చూశాక అప్పుడు డిసైడ్ చేద్దామంటూ.. వారు తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తరపున టికెట్లు పొందిన నాయకులు లబోదిబోమంటుండడం గమనార్హం.