తమిళనాడు కోలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో ప్రభు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే, ఆయనంతట ఆయనే ఈ పార్టీని ఎంచుకున్నట్టు తెలియడం లేదు. ఇటీవల ఆయన తాను.. రాజకీయాల్లోకి రావాలని అనుకున్నట్టు చెప్పడంతో కాంగ్రెస్ నేతలే ఆయనను సంప్రదించి తమ పార్టీలోకిరావాలని ఆహ్వానించినట్టు సమాచారం. మొత్తం మీద ఈరోజో.. రేపో ప్రభు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం మాత్రం ఊపందుకుంది. ఇక, ఎందుకు ఇలా జరిగిందనే విషయంపై ఆసక్తికర రాజకీయ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి ఎంతగా వ్యతిరేక పవనాలు వీచినా.. వాటిని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విషయాలు ప్రజల్లో తీవ్ర చర్చకు వచ్చాయి. ఒక రకంగా ఈ రెండు పథకాలు కూడా ప్రజలను ఇబ్బందుల పాలు చేశాయి.
వీటిని అందిపుచ్చుకుని కాంగ్రెస్ పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎక్కడా అలాంటి వాతావరణం కనిపించలేదు. దీనికితోడు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేతిలో ఉన్న అధికారం కూడా బీజేపీ చేతిలోకి వెళ్లిపోతోంది. దీంతో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది. ఈ కోవలోనే 2019 ఎన్నికల విషయాన్ని యోచిస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఎలాగైనా మోడీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నా చితకా పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఇక్కడ మరోసారి అధికారం సంపాయిం చుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, బీజేపీని కట్టడి చేసేందుకు స్థానిక పార్టీ పట్టుమని మెజారిటీ స్థానాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కని పార్టీ జేడీఎస్తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది.
ఇక, డిసెంబరులో జరగబోయే తెలంగాణా ఎన్నికల్లోనూ ఒంటరిపోరుకు సాధ్యం కాదని గ్రహించిన కాంగ్రెస్ మహా కూటమి పేరుతో టీడీపీ, సీపీఐ వంటి పార్టీలతో జట్టుకట్టి పోరుకు సిద్దమైంది. ఇక్కడ కూడా అధికార టీఆర్ ఎస్, బీజేపీలు లోపాయికారీ పొత్తులకు తెరదీసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఇలా చేయాల్సి న పరిస్తితి వచ్చిందని చెబుతున్నారు. కానీ, అంతర్గతంగా మాత్రం కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిన్నా చితకా అయినా సరే తమకు మద్దతు ఇచ్చేవారు ఉంటే వారికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే 2019 సార్వ త్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, తమిళనాడు నుంచి ఒకింత ప్రభావం చూపించగలడని భావిస్తున్న ప్రభును పార్టీలోకి ఆహ్వానించేందుకు నాయకులు రెడీ అయ్యారు. ఈ ఆహ్వానానికి ప్రభు కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. మొత్తం మీద.. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.