జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం చేసినా రికార్డుగా మారుతోంది. ఆయన చంద్రబాబుతో కలిసి ఉన్నప్పుడు.. ఇప్పుడు దూరంగా ఉన్న సమయంలోనూ కూడా ఆయన చేస్తున్న ప్రతి పనికీ, వేస్తున్న ప్రతి వ్యూహానికి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. చంద్రబాబుతో విడిపోయి.. ఢీ అంటే ఢీ అనే రేంజ్లో ఆయన దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోరు యాత్ర పేరిట ఉత్తరాంధ్రలో ప్రారంభించిన యాత్ర.. ను సక్సెస్ చేశారు. ఇక, ఈ యాత్ర పశ్చిమ గోదావరిలో ముగిసింది. అయితే, ఇంతలోనే ఆయన దీనికి బ్రేక్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు వచ్చే నెల 2 నుంచి తిరిగి ఈ పోరు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ నుంచి రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఈ ప్రయాణాన్ని కూడా రాజకీయంగా మలుచుకునేందుకు పవన్ చేసిన వ్యూహం ఏంటంటే.. పవన్ పోరు యాత్ర తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడి వరకు కూడా ఆయన రైలులో ప్రయాణించి ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈసందర్భంగా కూడా పవన్.. ఉత్తరాంధ్ర ప్రజలకే ఎక్కువ ప్రాము ఖ్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2 వ తేదీ ఉదయం హైదరాబాద్లో జన్మభూమి ఎక్స్ప్రెస్లో బయల్దేరే పవన్.. విజయవాడ వరకు మౌనంగానే చేరుకుంటారు. ఇక, అక్కడి నుంచి అంటే విజయవాడకు చేరుకున్న నాటి నుంచి ఆయ న వివిధ వర్గాల ప్రజలతో మమేకమై.. వారి నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక, విజయవాడ నుంచి ప్రారంభమయ్యే ఆయన పలకరింపుల యాత్ర తుని వరకు సాగనుంది.
ప్రతి స్టేషన్లోను రైలు ఆగే కొద్ది సమాయాన్ని పవన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం.. విజయనగరం.. వంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్న కూలీలే లక్ష్యంగా పవన్ వారిని పలకరించి వారి మనోగతాన్ని తెలుసుకుంటారు. అయితే, ఈ ఎంటైర్ ట్రైన్ ఎపిసోడ్లో పవన్ వ్యూహం ఏంటంటే.. ఉత్తరాంధ్రలో పాతుకుపోవడం. నిజానికి రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు రాష్ట్రాన్ని పంచుకున్నాయి. వైసీపీ, టీడీపీలు. ఇక, మిగిలిన ఉత్తరాంధ్రలో మాత్రం ఈ రెండు పార్టీలకు ఆశించిన మేరకు పట్టులేదు. దీంతో ఇక్కడ ప్రజలు ఎవరి పక్షాన నిలిస్తే.. వారికే రాష్ట్రంలో అధికారం దక్కేది. దీనిని గమనించిన పవన్.. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన రైలు యాత్ర సందర్భంగా కూడా వీరినే టార్గెట్ చేయడం గమనార్హం. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.