తెలంగాణా ఎన్నికల్లో అత్యంత ప్రచారంలోకి వచ్చేవి రెండే రెండు నియోజకవర్గాలు. అవి ఒకటి ఎల్బీనగర్. రెండు కూక ట్ పల్లి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఆంధ్రా ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు? అనేది ప్రధాన విషయం. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం సాధించింది. ఎల్బీనగర్ నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కూకట్ పల్లి నుంచి కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే, కూకట్పల్లి నుంచి విజయం సాధించిన మాధవరం కృష్ణారావు.. ఎన్నికల తర్వాత టీఆర్ ఎస్ గూటికి చేరిపోయారు. ఇప్పుడు ఆయన టీఆర్ ఎస్ టికెట్పై బరిలోకి దిగుతున్నారు. అయితే, ఇక్కడ నుంచి మహాకూటమిలో మిత్రపక్షమైన టీడీపీ పోటీకి దిగుతోంది.
కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఈ. పెద్దిరెడ్డిని రంగంలోకి దింపాలని దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. కానీ, కేసీఆర్ వ్యూహం ప్రకారం ఇక్కడ టీఆర్ ఎస్ అభ్యర్థిగా మళ్లీ కృష్ణారావును గెలిపించుకోవాలని భావిస్తున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఏపీ వాసులు అధికంగా ఉన్నారు. దీనికితోడు కమ్మ కులానికి చెందిన కుటుంబాలు వేలల్లోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ టీఆర్ ఎస్ నేతకు అవకాశం ఉంటుందా? అనేది కేసీఆర్ కు ఎదురవుతున్న ప్రశ్న. అదేవిధంగా కూకట్పల్లిలో అభివృద్ధి మొత్తం చంద్రబాబు హయాంలోనే జరిగినట్టు ఇక్కడివారు ఎక్కువగా విశ్వసిస్తున్నారు. దీంతో ఆయనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ కూడా ఉండడం గమనార్హం. ఇదిలావుంటే, కేసీఆర్ ఇటీవల చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు ఇక్కడ బాగానే నాటుకున్నాయి.
ఆంధ్రాద్రోహి.. అంటూ కేసీఆర్ చంద్రబాబును విమర్శించడాన్ని కూకట్పల్లి వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వచ్చిన అవకాశాన్ని వాడుకుని వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇచ్చిన అభ్యర్థికి కాకుండా.. టీడీపీ తరఫున ఎవరు నిలబడ్డా గెలిపించి తీరాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సర్వేల ద్వారా తెలుస్తోంది. ఇక, ఇక్కడి టికెట్ మహాకూటమిలో టీడీపీ సాధించుకుంది. పెద్దిరెడ్డిని ఇక్కడ నుంచి పోటీకి దింపుతోంది. ఈయన వివాద రహితుడు పైగా.. ఎలాంటి ఆరోపణలు లేవు. దీంతో కూకట్పల్లి వాసులు ఈయనకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇక, తొలుత తాను తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం చేయనని చెప్పినా.. అక్కడి నాయకుల ఒత్తిడి మేరకు ఎన్నికలకు ముందు కనీసం తెలంగాణా అభ్యర్థులు బరిలో నిలిచే స్థానాల్లో అయినా ప్రచారం చేసేందుకు చంద్రబాబు వెళ్లాలని తాజాగా నిర్ణయించారు.
ఈ జాబితాలో కూకట్పల్లి కూడా ఉండడం ఖాయం. దీంతో బాబు ప్రచారం మరింతగా ఇక్కడ ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూకట్పల్లి రాజకీయాలను ఎలా ఎదుర్కొనాలా? అనే విషయంపై తర్జన భర్జన పడుతున్నా రని అంటున్నారు. ఇప్పటికే ఒకసారి కేసీఆర్ తనయుడు కేటీఆర్ .. చంద్రబాబు పట్ల తన తండ్రి, సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను రాజకీయంగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా చూడొద్దని ప్రచారం చేస్తున్నారు. అయినా.. కూడా ఏపీ సెటిలర్లు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలను లైట్గా తీసుకునేందుకు అంగీకరించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.