ఇపుడు అసలు మీడియా ఏదీ అంటే సోషల్ మీడియా అన్నది అందరికీ తెలిసిందే. ఏ ఘటన జరిగినా వెంటనే జనం తమ‌ రియాక్షన్ చెప్పేస్తున్నారు. మనసులో ఏదీ దాచుకోకుండా కడిగిపారేస్తున్నారు. తప్పుని తప్పుగా చెప్పడమే కాదు నాయకుల అసలు బండారమూ బయటపెడుతున్నారు. ఓ విధంగా రాజకీయ విశ్లేషకులకు సైతం అందని ఆలోచనలు ఇపుడు నెటిజన్లు చేస్తున్నారు.


టీడీపీకి అత్మకు శాంతి :


ఏ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీడీపీని అన్న నందమూరి ప్రారంభించారో అదే కాంగ్రెస్ లో టీడీపీని బాబు కలిపేయడాన్ని నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఏపీలో టీడీఎపీకి ఏమైందని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నందమూరిని పదవీచ్యుతున్ని చేయడమే కాదు, 2014లో అడ్డగోలుగా ఏపీని ముక్కలు చేసిన కాంగ్రెస్ తో బాబు అంటకాగడాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. అందుకే టీడీపీ ఆర్ ఐ పి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ఇపుడు అసలైన వెన్నుపోటు:


అపుడెపుడో అన్న గారికి వెన్నుపోటు పొడిచారని చంద్రబాబును అందరూ అంటూంటారు కానీ, ఇపుడు అసలైన వెన్నుపోటు పొడిచారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాబు ఇంతలా టీడీపీ ఆశయాలకు ఘోరీ కట్టడమేంటని కూడా నిలదీస్తున్నారు. అసలైన అన్నగారి అభిమానులు ఎవరూ దీనిని సహించరని కూడా ఖండితంగా చెప్పేస్తున్నారు. బాబు నలభయ్యేళ్ళ అనుభవం ఏమైందని కూడా అడుగుతున్నారు. టీడీపీని, బాబును ఎవరూ ఇక రక్షించలేరని కూడా భవిష్యత్తు  కూడా చెప్పేస్తున్నారు.


ఆత్మగౌరవం తాకట్టు:


తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టుపెట్టారంటూ బాబుపైన నిప్పులు చెరుగుతున్నారు. ఈ రోజు ఏపీ ఇలా వుండడానికి అసలైన విలన్ కాంగ్రెస్ అని, అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ ఆంధ్రులకు తీరని వేదన మిగిల్చిందని కూడా నిష్టూరాలు ఆడుతున్నారు. అటువంటి పార్టీని నిన్నటి వరకూ తిట్టీ తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు ఇపుడు ఏ ముఖం పెట్టుకుని కలుస్తారని మండిపడుతున్నారు.
బీజేపీని వ్యతిరేకించడం వరకూ సబబుగా ఉన్నా మళ్ళీ కాంగ్రెస్ తో కలవడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు.మొత్తానికి నెటిజన్లు మండిపోవడం చూస్తూంటే ఈ కలయిక ప్రజలకే నచ్చడం లేదన్న అభిప్రాయం కలుగుతోంది. మరి బాబు ఎలా ఒప్పిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: