తెలంగాణ లో ఎన్నికలు హీట్ మొదలై వచ్చే నెలలో కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు కాబోతుంది. అయినా ఇంత వరకు జగన్ పార్టీ తెలంగాణ లో పోటీ గురించి ఇంత వరకు స్పందించలేదు. అయితే ఇంతకు జగన్ పోటీ పెట్టాలనుకుంటున్నాడా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. అయితే తెలంగాణ వాదం ఒక్కటే ఇప్పుడు ఎవరినీ గెలిపించలేదు ఈ రాష్ట్రంలో. తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గంలో జగన్ పట్ల ఎంతోకొంత సానుకూలత ఉంటుంది. అలాగే వైఎస్ అభిమాన ఓటు కూడా కొంత ఉంటుంది. వీళ్ల ఓట్లతో వైసీపీ గెలిచేస్తుందని కాదు కానీ.. ఉనికి చాటవచ్చు. ధీటైన అభ్యర్థులు దొరికితే కొన్నిచోట్ల సంచలనాలూ రేపవచ్చు.
ఎలాగూ కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో వెళ్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీటి పొత్తు మధ్యన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున రెబల్స్ రంగంలో ఉంటారు. ఇలాంటి వారిలో కొందరు ఛాన్స్ దొరికితే వైసీపీ తరఫున పోటీ చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ వంటి జిల్లాల్లో వైసీపీ తరఫున ధీటైన అభ్యర్థులు గనుక రంగంలోకి దిగితే.. అక్కడ ఈ పార్టీ కూడా బలమైన పోటీదారే అవుతుంది. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాత్రం తెలంగాణలో పోటీని పూర్తిగా లైట్ తీసుకున్నట్టుగా ఉన్నాడు.
ఇప్పుడు జగన్ తెలంగాణలో కొన్నిచోట్ల అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ ను దెబ్బకొట్టవచ్చు. ఎలాగూ ఏపీలో టీడీపీతో చేతులు కలిపి కాంగ్రెస్ వాళ్లు జగన్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అయితే వైసీపీ అధినేత ఇప్పటి వరకూ తెలంగాణలో పోటీ విషయంలో ఎలాంటి మాటా చెప్పిన దాఖలాలు లేవు. వైసీపీలోని తెలంగాణ నేతలు కొందరు పోటీకి సై అంటున్నారు. అయితే ఆ పార్టీ తరఫు నుంచి ఇంకా అధికారిక ప్రకటనలు ఏవీలేవు.