రాష్ట్రంలో ఒకప్పుడు పార్టీలను చూసి నేతలను గెలిపించే పరిస్థితి ఉంది. నేత ఎవరనే విషయంతో సంబంధం లేకుండా ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు? అనే విషయాన్ని చూసుకుని ప్రజలు ఓట్లు కుమ్మరించేవారు. కానీ, పరిస్తితులు మారి పోయాయి. నాయకుల బలం పెరిగిపోయింది. దీంతో ఏపీలోని చాలా జిల్లాల్లో నాయకులకే హవా పెరుగుతోంది. నాయకు లు ఏ పార్టీలో ఉండి చక్రం తిప్పినా.. పోటీ చేసినా.. ప్రజలు ఓకే చెబుతున్నారు. ఓట్లు వేస్తున్నారు. గెలిపిస్తున్నారు. ఇలాంటి వారిలో గంటా శ్రీనివాసరావు, జగన్, చంద్రబాబు ఇలా చాలా మందే ఉన్నారు. వారి పేరు చాలు.. ప్రజలు ఓటెత్తుతారు. ఇప్పుడు ఇలాంటి నాయకుల్లో ఒకరుగా గుర్తింపు సాధించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు. ఉరఫ్ నెహ్రూ!
ఈయన కూడా పార్టీలకు అతీతంగా గుర్తింపు సాధించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించారు. దివంగత వైఎస్ అనుచరుడుగా ఉన్న జ్యోతుల.. తర్వాత వైసీపీలో చేరి జగన్కు అన్నగా వ్యవహరించారు. అయితే, తన కుమారుడి భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీ మారిపోయారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. ఈపరిణామాన్ని ఊహించని జగన్.. తీవ్రంగా కలత చెందారు. అసెంబ్లీలో తన తర్వాత జ్యోతుల కే జగన్ పెద్ద పీట వేశారు. అయినా ఆయన పార్టీని వీడిపోవడం తీవ్రంగా కలిచి వేసింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో నూ వచ్చే ఎన్నికల్లో జ్యోతులకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తూర్పులో పాదయాత్ర నిర్వహించినప్పు డు కూడా యాత్ర షెడ్యూల్లో లేని జగ్గంపేటను అప్పటికప్పుడు చేర్చుకుని జగన్ పాదయాత్ర ఆ నియోజకవర్గం మీదుగా సాగడం, బహిరంగ సభ నిర్వహించడం సంచలనం గా మారింది.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటి? ఆయనను ఎలా నిలువరించాలి? వంటి విషయాలను జగన్ సీరియస్గా తీసు కున్నారు. ఈ నేపథ్యంలోనే జ్యోతులపై సరైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు తోట రామస్వామి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మనవుడు అయిన తోట రామస్వామిని వైసీపీలోకి తీసుకుని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీకి దించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గానికి మొదటిగా ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రూ వైసీపీలో గెలిచి టీడీపీ చేరారు.
ఆ స్థానంలో ముత్యాల శ్రీనివాస్ను కోఆర్డినేటర్గా నియమించారు. అతడి స్థానంలో జ్యోతుల చంటిబాబుకు ఆ పదవి కట్టబెట్టారు. పెద్దాపురం కోఆర్డినేటర్గా తోట సుబ్బారాయుడును తొలగించి దొరబాబుకు కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టారు. అలాగే జగ్గంపేట కోఆర్డినేటర్ సీటు విషయంలో కూడా చంటిబాబుకు హ్యాండిచ్చి తోటతో చేతులు కలపి రామస్వామికి వైసీపీ పగ్గాలు అప్పజెప్పడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. జ్యోతులకు ఓటమి ఖాయమని, తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుందని కూడా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.