విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా కంగారు పడ్డారు. జగన్ పై జరిగిన దాడిని ఏపీ లో ఉన్నా అధికార పార్టీ తెలుగుదేశం తప్ప మిగతా రాజకీయ పార్టీల నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేతలు ఖండించారు.
అయితే జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు విషయంలో ఇప్పటి వరకు సరైన స్పష్టత నిందితుడు శ్రీనివాస్ దగ్గర నుండి రాబట్టలేకపోయారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలో జగన్ భద్రత విషయమై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం సృష్టించింది.
అక్టోబర్ 25 వ తారీఖున విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి అనంతరం అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న జగన్ నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందారు. గాయం మానడానికి కొద్దిరోజులు సమయం పడుతుందన్న వైద్యుల సూచన మేరకు జగన్ పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం జగన్ హైదరాబాద్లోని లోటస్ పాండ్ లో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్కు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. బుల్లెట్ ప్రూప్ వెహికల్ను ప్రభుత్వం కేటాయించింది. అలాగే జగన్ ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు మరియు చంద్రబాబు మాత్రం జగన్ పై జరిగిన హత్యా యత్నం విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఇష్టమొచ్చిన రీతిలో విమర్శలు చేస్తున్నారు.