రాజకీయాల్లో యువత లోటు చాలానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వృద్ధతరమే రాజకీయాల్లో చలామణి అవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయాల్లోకి యువతను ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావమో.. ఏమో.. ఈ మధ్య కొంచెం యువగళాలు రాజకీయాల గురించి మాట్టాడుతున్నాయి. అయినాకూడా ఎక్కడో ఏదో సందేహం.. మనం ప్రజల్లోకి వెళ్లి చేసేదేంటి? అనేవారు కొందరైతే.. ఆ.. రాజకీయాల్లోకి వెళ్తే.. ఒకడిని తిట్టాలి.. పదిమందితో తిట్లు తినాలి! అనే నిర్వేదం కూడా కనిపిస్తోంది. మరోపక్క, రాజకీయాల్లోకి వారసులు మాత్రమే అవకాశం ఉంటుందని, కొత్తవారికి ఛాన్స్ కష్టమేనని అనేవారు కూడా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా.. యువతకు మాత్రం రాజకీయాల్లో చాలా తక్కువ స్పేస్ ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా 30-35 మధ్య వయసున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు.
ఈ నేపథ్యమో ఏమో.. కొందరు యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా డైలాగ్ కింగ్ మంచు మోహన్ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెడతానంటూ.. ఓ కొత్త గళం వినిపిస్తోంది. ఆయనే మంచి మనోజ్. హీరోగా అరంగేట్రం చేసిన మనోజ్ సంచలన విజయాలు నమోదు చేయకపోయినా.. టాలీవుడ్లో ఒకింత సక్సెస్ రేటునే కొనసాగిస్తున్నాడు. ఇక, ఇటీవల కాలంలో ట్విట్టర్లో యాక్టివ్గానే ఉంటున్నారు. సామాజికంగా జరుగుతున్న సంఘటనలు, రాజకీయాలపై ఆయన తనదైన మార్కుతో స్పందిస్తున్నారు. నల్గొండలో ప్రణయ్ హత్య జరిగిన సందర్భంలోను, శ్రీకాకుళం తితలీ తుఫాను వచ్చిన సందర్భంలోనూ సంయమనం పాటించాలని, ప్రజలకు అండగా నిలవాలని, కులాంతర వివాహాలను అందరూ అర్ధం చేసుకోవాలని ఇలా.. తనదైన మార్కుతో స్పందించారు మనోజ్.
తాజాగా విశాఖలో వైసీపీ అధినేత జగన్పై జరిగిన కత్తి దాడి ఘటన విషయంలోనూ ఇలాంటి వాటికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని వ్యాఖ్యానిం చారు. ఇలా ఏ విషయంపైనైనా స్పందించే లక్షణాన్ని అలవరుచుకున్న మనోజ్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు చెప్పారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని.. తిరుపతి కేంద్రంగా ప్రజాసేవను ప్రారంభించి.. రాయలసీమ ప్రాంతమంతటికి విస్తరిస్తానని గత నెలలో లేఖ కూడా రాశాడు. తాజాగా ఓ అభిమాని ట్విట్టర్ లో మనోజ్ ను ఇదే విషయంపై ప్రశ్నించాడు. ‘మీ ప్లాన్ ఏంటి.? మీ స్కీం ఏంటి.? మీ గోల్ ఏంటి’ అని అడిగాడు. దీనికి మనోజ్ చాలా ఆసక్తిగా స్పందించాడు. ఓ ఖాళీ ప్రదేశా న్ని సుధీర్ఘంగా చూస్తున్న ఫొటోను పోస్టు చేసి దానికి ఇలా రాసుకొచ్చాడు.
‘పేద విద్యార్థులు - రైతుల కోసం ఏదీ ఒకటి చేయాలనుకుంటున్నా.. నా కల ఈ ఖాళీ ప్రదేశం ద్వారా తీరబోతోంది’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తన కల ఇక్కడి నుంచే తీరబోతోందని హింట్ ఇచ్చాడు. తానున్న చోట ఉచిత ఆహారం - క్రీడా సౌకర్యాలు - మంచినీటి వసతి ఉండాలన్నదే తన లక్ష్యమని వివరించాడు. మొత్తానికి మోహన్ బాబు కుటుంబం నుంచి సినీ వారసుడే కాకుండా రాజకీయ వారసుడు కూడా వస్తుండడంపై మంచు అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరి మనోజ్ ఏ పార్టీలో చేరతాడు. ఎలా ముందుకు వెళ్తాడు. అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉండడం గమనార్హం.