నందమూరి తారక రామారావు తెలుగుదేశ స్థాపనతో రాజకీయాల్లో సమూల మార్పులు వచ్చాయి. నాటికి గతంలో లేని అనేక కుల మత వర్గాలకు రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం లభింపజేసింది. అందుకే, బీసీల పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా ఉంటూ పార్టీ అధి కారంలోకి రావడానికి తమదైన పాత్రను పోషించారు.
అదంతా ఒకప్పుడు, ఇప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా లేరని ఒకనాడు పటిష్టమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు తెలుగుదేశం కోటకు బీటలు వారేలా చేయనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి చెందితే దానిలో ప్రధానమైన పాత్ర పోషించేది బీసీ లేనని చర్చించుకుంటున్నారు రాజకీయ పండితులు. టిడిపికి రాజకీయంగా సెంటిమెంట్ జిల్లాలుగా పేరొందిన ఉభయగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఈ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాలలో బీసీ ఓటు బ్యాంకు అత్యంత కీలకంగా ఉంటుంది. పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించే ఏకైక ఓటు బ్యాంకు ఈ జిల్లాలలో బీసీలు అని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఇలా ఉంటే చంద్రబాబు కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో ఆ అధికారం కేంద్రానికి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు అయితే కాపుల కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్టీఆర్ విద్యోన్నతి ,విదేశీ విద్య మొదలగు పథకాలను కాపుల కోసం బాబు అమలు చేస్తున్నారు.
అంతేకాదు కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు కూడా పంపారు . అయితే ఈ విషయంలోనే వెనుక బడిన వర్గాలకు బాబు చర్యలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఇప్పటికే వెనుకబడిన వారికి ఆదరణ లేదని, కాపులు బిసి లోకి వస్తే బీసీల మరింత దయనీయంగా మారిందని బీసీ నేతలు తమ గోడు వెళ్లగక్కుతున్నారు. అలాగే “ఆదరణ” పథకాన్ని చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రారంభించిన సరే అర్హులైన పేద బీసీలకు అది ఉప యోగపడటం లేదని బీసీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఈ క్రమంలోనే బీసీలు ఇతర పార్టీల వైపు చూస్తుండటం తెలుగుదేశం పార్టీలు ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ బీసీ నాయకులకు తగిన గౌరవం లేదని పదవులకు తమని దూరం పెడుతున్నారని గతంలో ఎంతోమంది నేతలు బాబు పై అసహనం వ్యక్తం చేశారు. ఇదే అదనుగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో బీసీలపై వరాల జల్లు కురిపించిన సంగతి విధితమే. రాజ్యాధికారానికి దూరమైన వెనుకబడిన వర్గాలను చట్టసభల్లో కూర్చోబెడతానని విశ్వబ్రాహ్మణ శాలివాహన, నాయి బ్రాహ్మణ, రజక మొదలగు కులాలకు ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ప్రకటించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా మంది బీసీ నేతలు వైసీపీ వైపు నడవడానికి సిద్ధమైపోయారు.
జనసేన అధినేత లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం బీసీ మంత్రం జపించడం టీడీపీకి కోలుకోలేని దెబ్బేనని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ టిక్కెట్టు ప్రకటించి బీసీలను తన వైపుగా తిప్పుకోవడం లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి..అంతేకాదు రెండు జిల్లాలలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా బీసీలకే అధికంగా టిక్కెట్లు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఇలా వైసిపి, జనసేన అధినేతలు తెలివిగా బీసీలను తనవైపు తిప్పుకోవడంతో వచ్చే ఎన్నికల్లో బీసీలు బాబు కి దెబ్బేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.