తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పైనే ఉంది. కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్టు ప్రకటించిన రోజుకు ఎప్పటికీ టీఆర్ఎస్ పై రోజురోజుకు జనాల్లో ఎంత పెరుగుతున్న మాట వాస్తవం. కెసిఆర్ పై మహాకూటమి తరపున కాంగ్రెస్ నుంచి పోటీకి దిగుతున్న ప్రతాపరెడ్డి ఈసారి కేసీఆర్ ను ఓడించి తీరుతామని సవాలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా తమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ సీఎంగా ఉన్న కేసిఆర్ తమ నియోజక వర్గానికి చేసిందేమీ లేదని గజ్వేల్ జనాల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తున్న మాట వాస్తవం.
గజ్వేల్లో ఈ రెండు నెలల్లో పరిణామాలు వేగంగా మారాయి. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్కు గట్టిపోటీ తప్పదనే టాక్ మొదట్లో వినిపించింది. తాజాగా.. ఆయన ఇక్కడ ఓడిపోయినా ఆశ్చర్యమేమీ లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. నిజానికి.. నిఘావర్గాలు చెబుతున్న మాట కూడా ఇదేనని.. పలు సంస్థలు సర్వేల్లోనూ ఇదే విషయం తేలినట్లు సమాచారం. టీడీపీ - కాంగ్రెస్ పొత్తుతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్రెడ్డి గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా ఓడిపోతూ వస్తుండడం, ఇక్కడ కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆయన ఫాంహౌస్కే పరిమితమవ్వడం లాంటి విమర్శలు ఇక్కడ నియోజకవర్గ జనాలను ఆలోచింపచేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాను సొంతంగా చేయించుకున్న సర్వేలతో పాటు నిఘా సంస్థలు సైతం గజ్వేల్ కేసీఆర్కు సేఫ్ కాదని చెప్పడంతో ఇప్పుడు ఆయన సీటు మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మేనల్లుడు, మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి బరిలోకి దిగాలని అనుకుంటున్నారట. ఇక గజ్వేల్ నుంచి మంత్రి హరీశ్రావును బరిలోకి దింపాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హరీష్ కాన్సంట్రేషన్ అంతా గజ్వేల్ మీదే ఎక్కువుగా ఉంది.
అయితే దీని వెనక ఏమైనా మతలబు ఉందా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే పార్టీలో హరీశ్కు ప్రాధాన్యం దక్కడం లేదని, మొత్తం కేటీఆర్ దే నడుస్తుందని పార్టీవర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా గెలవలేని స్థానం నుంచి మంత్రిగా హరీశ్రావు గెలుస్తాడని కేసీఆర్ ఎలా అనుకుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి