విశాఖ భూ కుంభకోణాలపైన దాదాపు రెండేళ్ళ క్రితం ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటి (సిట్) విచారణ చేసి ఇచ్చిన నివేదికను ఎట్టకేలకు మంత్రివర్గం ఆమోదించింది. ఈ నివేదిక తీరు చూస్తే కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిట్ విచారణలో పెద్ద తలకాయలు ఉంటాయని బాగా ప్రచారం జరిగింది. ఎన్నికల ఏడాది ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడని ఇలా వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి రాజకీయ నేతలకు సిట్ క్లీన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అస్మదీయులను తప్పించారా:
సిట్ నివేదికలో మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం ఉంటుందని, వారే భూ కబ్జాలకు పాల్పడ్డారని అంతా భావించారు. విపక్షాలు సైతం ఇదే ఆరోపణ చేస్తూ వచ్చాయి. . తీరా చూస్తే సిట్ నివేదిక పూర్తిగా అధికారులదే తప్పు అన్నట్లుగా తేల్చడంతో షాక్ తినాల్సివస్తోంది. అసలు అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంతటి పెద్ద పనులకు ఒడిగడతారా అన్న లాజిక్ ని కూడా పక్కన పెట్టేసి సిట్ విచారణలో తప్పంతా వారిదేననడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.
భూములు వెనక్కు వస్తాయా :
సరే, ఎవరి వల్లనైనా జరిగింది అతి పెద్ద భూ కబ్జా. మరి దానికి సంబంధించి బాధితులు చేసుకున్న విన్నపాలు ఫలిస్తాయా. వారికి న్యాయం జరుగుతుందా. వారి భూములు తిరిగి వెనక్కు వస్తాయా. అదే విధంగా ప్రభుత్వ భూములు వందలాదిగా దురాక్రమణలకు గురి అయ్యాయి. వాటి సంగతి ఏం తేలుస్తారన్నది కూడా తెలియాల్సి ఉంది. వీటి కోసం అధికారులతో మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏం చేస్తుందో అన్నది చూడాలి.