ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉండడంతో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఎలాంటి ప్రణాళికతో ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు? అంటే .. తాజా సమాచారాన్ని బట్టి బాబు.. పరుగో పరుగు! ఫార్ములాను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ, ప్రభుత్వ పథకాల తీరుపై ఒక అంచనాకు వచ్చేందుకు అంతర్గత నివేదికలు తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నరు. ఆయా నియోజక వర్గాల్లో ప్రజల సంతృప్తిపై ఒక అవగాహనకు వస్తారు. ఇదే తరుణంలో సమస్యలను పరిష్కరించగలిగితే తిరి గి ప్రజామోదం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు చంద్రబాబు అంచనాకు వచ్చారు. పార్టీపరంగా ఉన్న అసంతృప్తి వాదులను గుర్తించి ఆ మేరకు ముందస్తుగా జాగ్రత్తపడాలనే ఆలోచన వ్యక్తమవుతోంది.
అదేసమయంలో వైసీపీ, బీజేపీ, జనసేన కదలికలపై పూర్తిగా దృష్టి సారించి ఆ పార్టీ వ్యూహాలను ఢీ కొట్టేలా కొత్త వ్యూహా లు సిద్ధం కావాలని బాబు భావిస్తున్నారు. మంత్రులకు మరిన్ని బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ఈ మంత్రు లు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా చురుకైన పాత్ర పోషించేలా బాధ్యలు ఉండబోతున్నాయని ఒక అంచనా. ఇదే సమయంలో అత్యంత కీలక జిల్లాల్లో అంతర్గతంగా పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే నిర్వహించిన సర్వేల్లో ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేనట్టు తేలింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసం తృప్తి శాతం అత్యధికంగా కనిపించినా సీఎం చంద్రబాబుపై సానుకూలత చెక్కు చెదరకపోవడాన్ని గుర్తించారు.
సమయం దగ్గర పడుతున్నా ఇంకా పట్టనట్టుగా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాబోయే రెండు నెలల కాలాన్ని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఎక్కడికక్కడ అంచనాలకు తగ్గట్టుగా పనులు పూర్తవుతున్నాయా, పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయా, ఇంతకు ముందే ఇచ్చిన హామీల్లో ఏమైనా పెండింగ్లు ఉన్నాయా అనేదానిపై ప్రభుత్వం ఆరా తీయడం ఆరంభించింది.
కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇప్పటికే భారీఎత్తున హామీలు ఇచ్చి ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గుర్తించారు. దీనికి విరుగుడిగా సాధ్యమైనంత మేర వ్యూహాన్ని మార్చి పథకాలందరికీ చేరువయ్యేలా జాగ్రత్తపడాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు యంత్రాంగం పనితీరులోనూ మార్పులను ఆశిస్తున్నారు. మొత్తానికి పరుగో.. పరుగు సూత్రం ద్వారా ఫలితం సాధించాలని చంద్రబాబు నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.