ఆపరేషన్ గరుడ ఇంకా పూర్తికాలేదా ? త్వరలో ప్లాన్ బి అమలవుతోందా ? ఈసారి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి, ఈడి దాడులు మొదలవ్వనున్నాయా ? ఈ ప్రశ్నలన్నింటికీ సిని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అవుననే సమాధానం  చెబుతున్నారు. త్వరలో నాలుగురు మంత్రులు, ఓ 20 మంది ఎంఎల్ఏలు కమ్ వ్యాపారస్తులతో పాటు పలువురు ఎంపిలపై ఐటిదాడులు జరగబోతున్నట్లు ఆయనకు సమాచారం ఉందట. ముఖ్యమంత్రి కార్యాలయంలోని అత్యున్నత స్ధాయి ఉన్నతాధికారి నుండే తనకు సమాచారం అందినట్లు చెబుతున్నారు. అంతకన్నా వివరాలు  ఆయన వద్ద లేవట.

 

విచిత్రమేమిటంటే,  జరగబోయే ఐటి దాడులు, ఈడీ దాడులన్నీ ముందుగా సినీమా వాళ్ళకే తెలుస్తున్నాయి. సినిమా వాళ్ళు చెబితేనే  చంద్రబాబునాయుడుకు కూడా తెలుస్తోంది.  ఆపరేషన్ గరుడ పేరుతో మొన్నటి మార్చిలో సినీనటుగు శివాజి చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు ఎవరు నమ్మకపోయినా తర్వాత జరిగిన ఐటి దాడులు, జగన్ పై దాడితో శివాజి చెప్పిన మాటలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆ వివాదం ఇంకా చల్లారకముందే తాజాగా మరో సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి రెండో బాంబు పేల్చారు.

 

చంద్రబాబునాయుడుకు సన్నిహితంగా ఉండే కోస్తా ప్రాంత జిల్లాలకు చెందిన ఓ మంత్రితో పాటు మరో ముగ్గురు మంత్రులపై ఐటి దాడులు జరుగుతాయని చెప్పటం గమనార్హం. తమ్మారెడ్డి చెప్పిన నలుగురు మంత్రుల్లో ఒక మంత్రెవరో తెలిసిపోతోంది. మిగిలిన ముగ్గరు మంత్రులెవరో తేలాలి. అలాగే 20 మంది ఎంఎల్ఏలు కమ్ వ్యాపారస్తులు, ఎంపిలు కమ్ పారిశ్రామికవేత్తలున్నారట. సరే వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలన్నాక ఐటి దాడులు సహజమే. కాకపోతే టిడిపి ప్రజాప్రతినిధులపై ఐటి దాడులు జరుగుతుంటేనే ఎందుకంత సంచలనం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. అందులోను ముందుగా సినిమా వాళ్ళకే సమాచారం ఎలా అందుతోందో ఆలోచించాల్సిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: