ఇప్పుడు రాజకీయ పార్టీలకు నాయకులకు చచ్చె చావు వచ్చింది. తెలంగాణాలో ముందస్తు ఎన్నికలలో అమలవ్వబోయే ఎన్నికలసంఘ నిబంధన దెబ్బకు అన్నీ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులందరు గందరగోలంలో పడి ఆగమాగమైపోతున్నారు.
మా నాయకుడు వీరుడు, శూరుడు, మొనగాడు, పులి, సింహం, బెబ్బులి ఇలా రకరకాల పొగడ్తలతో రాజకీయ నేతల్ని కీర్తిస్తూ పత్రికల్లో, చానల్స్ లో ప్రకటనల్ని ఇప్పటి వరకూ చూశాం. రానున్న కొద్ది రోజుల్లో ఇందుకు భిన్నమైన ప్రకటల్ని పత్రికల్లో చూసే పరిస్థితి తెలుగు ప్రజలకు, అందునా తెలంగాణ ప్రజలకు ముందుగా, ముదస్తు ఎన్నికల సందర్భంగా రానుంది. ‘కేంద్ర ఎన్నికల సంఘం’ తాజాగా సుప్రీంకోర్ట్ ఆదేశాలతో అమలుచేస్తున్న ఎన్నికల నియమావళి ప్రకారం ప్రవేశ పెట్టిన నూతన విధానం తో ఈ పరిస్థితి రానుంది.
నూతన విధానం ప్రకారం, ఎన్నికల్లో శాసన సభలకు పార్లమెంటుకు ప్రజా ప్రతి నిధులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరిత్ర కు సంబంధించిన వివరాల్ని ఖచ్ఛితంగా పత్రికల్లో ప్రకటనల రూపంలో ఇవ్వాల్సిందే. అదీ ఒక్కసారి కాదు! మూడుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అలా ఇవ్వకుంటే వారిపై చర్యలు తీసుకోనున్నట్లుగా భారత ఎన్నికల సంఘం, స్పష్టం చేసింది.
నేర చరిత్ర ఉన్న నేతలు ఆ వివరాల్ని పత్రికల్లో మూడు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. టీవీల్లోనూ కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను భారత ఎన్నికల సంఘం దేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి విధిగా అమలు చేయ నుంది. దీంతో, కేసులున్న అభ్యర్థులు తమ నేరచరిత్రకు సంబంధించిన వివరాల్ని ప్రకటనల రూపంలో ఇవ్వాలి.
ఇలా తమకు సంబంధించిన పచ్చినిజాల్ని, చీకటి చరిత్రలను ప్రకటనల రూపంలో ఇచ్చినందుకు అయ్యే ఖర్చును ఎన్నికల్లో అభ్యర్థుల చేసే ఖర్చు కింద పరిగణిస్తారని ఈసీ పేర్కొంది. దీనిపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పత్రికల్లో మూడు సార్లు, టీవీల్లో అయితే 7సెకన్ల నిడివి తగ్గకుండా తమ కేసుల వివరాల్ని వెల్లడించా లని పేర్కొంది. ఇది మరింత ఆసక్తికరమైన విషయం కదా! తాము పత్రికల్లో టివిలలో ప్రకటనలు చేయగానే సరిపోదు, అలా చేసిన విషయాన్ని ఎన్నికల సంఘానికి తప్పని సరిగా పేపర్ కటింగ్, వీడియో క్లిప్పింగ్ జత చేసి సమాచారం తమకు ఇవ్వాలన్న నిబంధన పెట్టింది.
మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికల సందర్భంగా వీరుడు. శూరుడు అంటూ తమను తాము పొగుడుకునే అద్భుత ప్రకటనలతో పాటు. తమ చీకటి బ్రతుకుల నేర చరిత్ర ను వివరించాల్సిన అవసరాన్ని అభ్యర్థులు ఎలా? చేయిస్తారన్నది ఇప్పుడెంతో ఆసక్తికరం అనే చెప్పాలి.