ప్రజల్లో గెలిచి.. ప్రజల నోళ్లపై నానుతున్న నాయకులు ఎందరో ఉన్నారు. ఇలా గెలవక పోయినా.. కూడా ఎంతో మంది నాయకులు ప్రజలకు ఆరాధ్య దేవుళ్లు అయ్యారు. ఇలాంటి వారిలో అనేక మంది ఏపీ నుంచే ఉండడం గమనార్హం. అయి తే, తూర్పు గోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం నుంచి చెక్కుచెదరని విజయాలు నమోదు చేసుకున్న ప్రస్తుత టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు, మంత్రి యనమల రామకృష్ణుడు నేటి తరానికి చాలా దూరమయ్యారు. ఇంకా అవుతున్నారు కూడా. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించన నాటి నుంచి ఆ పార్టీతోనే ఉన్న నాయకుల్లో యనమల ఒకరు. చంద్రబాబుతో ఎన్టీఆర్ కు ఘర్షణ ఏర్పడినప్పుడు యనమల పూర్తిగా యూటర్న్ తీసుకుని బాబుకు మద్దతుగా నిలిచారు. ఫలితంగా చంద్రబాబు యనమలకు అత్యధిక గుర్తింపు, ప్రాముఖ్యం కూడా ఇచ్చారు.
ఒకానొక సందర్భంలో తూర్పు గోదావరి జిల్లా మొత్తాన్ని శాసించే స్థాయికి కూడా ఎదిగారు యనమల(ఇప్పుడు ప్రభావం లేదు). ఇదే జిల్లా తుని నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్పై యనమల ఆరుసార్లు వరుస విజయాలు కైవసం చేసుకున్నారు. ఇక, ఆ తర్వాత ఆయన ఇక్కడ వెనుదిరిగి చూసుకోలేదు. 2004 ఎన్నికల్లోనూ ఆయనే గెలిచారు. మెజా రిటీ ఎలా ఉన్నా.. గెలుపు మాత్రం యనమలనే వరించింది. అలాంటి పరిస్థితి నుంచి 2009లో తుని నియోజకవర్గంలో యనమలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యనమలకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి ప్రోత్సహించారు.
అయితే, 2014 ఎన్నికల విషయానికి వచ్చే సరికి.. అప్పుడు నిర్వహించిన సర్వలోనూ యనమలకు ఎదురు గాలులు వీస్తు న్నాయని తెలిసింది. అయినా కూడా చంద్రబాబు ధైర్యం చేసి ఆ కుటుంబానికే ఈ టికెట్ను కేటాయించారు. ఆ ఎన్నికల్లో యనమల సోరుడు కృష్ణుడు రంగంలోకి దిగారు. గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కృష్ణుడు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో యనమల ఫ్యామిలీకి తీవ్ర పరాభవం ఎదురైంది. ఇక, ఇప్పుడు మరో ఆరు మాసాల్లోనే ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో తుని టీడీపీ టికెట్ ఎవరికి ఇవ్వాలి? యనమల ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? టికెట్ ఇస్తే.. గెలిచే పరిస్థితి ఉందా? అనే చర్చ తెరమీదికి వస్తోంది.
ఈ నేపథ్యంలోనే అనూహ్యమైన చర్చ తెరమీదికి వచ్చింది. తునిలో అప్రతిహత విజయంతో దూసుకుపోయిన యనమ లకు ఇప్పుడు ఎందుకు ఎదురుగాలి వీస్తోంది? అనేది విషయంపై విశ్లేషణలు సాగుతున్నాయి. నిజానికి ఎన్నో ఆశలతో తుని ప్రజలు యనమలకు పట్టాభిషేకం చేశారు. అయితే, ఆయనకు ఎక్కడికక్కడ ఎదురు గాలులు వీయడానికి కారణం.. కుటుంబ రాజకీయాలే. ప్రజలను పక్కనపెట్టి అధికార దర్పం వెలగబెట్టడం, అందిన కాడికి బేరసారాలకు తెరదీయడం, కుటుంబం మొత్తంగా ప్రజలతో సంబంధాలు మానుకుని స్వలాభమే లక్ష్యంగా ముందుకు సాగడం వంటి పరిణామాలు.. యనమలను రాజకీయంగా ప్రజల్లో ఒంటరిని చేశాయన్న విమర్శలు ఉన్నాయి.
ఇక గత ఎన్నికల్లో యనమల కృష్ణుడు ఓడిపోయిన యనమల పట్టుబట్టి తన సోదరుడికి తుని ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పించుకున్నారు. దీంతో కూడా సొంత పార్టీలోనే తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. తాము సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడిన యనమల మాత్రం ఎన్నికల్లో ఓడిపోయిన తన సోదరుడికి ఏఎంసీ చైర్మన్ పదవి పెంచుకోవటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో యనమల ఫ్యామిలీకి తుని టిడిపి సీటు ఇస్తే టీడీపీ శ్రేణులో ఓడించేందుకు రెడీగా ఉన్నాయి. ఆయన ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రజాభిమానం నేడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లోనూ కనిపించనుంది. తన కుమార్తెను రంగంలోకి దింపినా.. సానుభూతి కనిపించే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి యనమల రాజకీయం ఓ పాఠం!!