పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఏ లోక్సభ స్థానంనుంచి ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు? అనుచరులకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? ఏ పార్టీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి? అనే ప్రశ్నలు తాజాగా తెరమీదికి వస్తున్నాయి. మరోఆరు మాసాల్లోనే ఎన్నికలు ఉండడంతో ఎక్కడెక్కడి నాయకులు తెరమీదికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజ్జం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫ్యాక్ష న్ రాజకీయాల కారణంగా 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమైన మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి కొంతకాలం క్రితం అజ్ఞాతం వీడారు.
ప్రజలతో మమేకమవుతున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా బిజ్జం తన అనుచర వర్గంతో హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి ఇప్పటినుంచే సైలెంట్గా పావులు కదుపుతున్నారు. సభలు.. సమావే శాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యవహార శైలిని గమనిస్తున్న ఆయన అనుచరులు, రాజకీయ విశ్లేషకులు కూడా వచ్చే ఎన్నికల్లో బిజ్జం ఖచ్చింతంగా నంద్యాల లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సంసిద్ధులవుతున్నారనే అంటున్నారు. మరోవైపు బిజ్జం పొలిటికల్ రీ ఎంట్రీపై కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. గతంతో పార్థసారథిరెడ్డి ఓసారి టీడీపీ తరఫున శాసనసభ్యుడిగా గెలుపొందారు.
అయితే, కాంగ్రెస్ మాజీ నాయకుడు కాటసాని రాంభూపాల్రెడ్డితో బిజ్జం వర్గానికి 40 ఏళ్లకు పైగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇద్దరిని పిలిచి ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. అప్పటి నుంచి బిజ్జం పార్థసారథిరెడ్డి పాణ్యం రాజకీయాలను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, 2014 ఎన్ని కల్లో పోటీ చేసేందుకు బిజ్జం ప్రయత్నించారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ కోసం సీరియస్గా చేసిన ప్రయత్నాలు ఫలిం చలేదు.. దాంతో మళ్లీ సైలెంటయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్థసారథిరెడ్డి పాణ్యంలోనే మకాం వేశారు. అనుచరవర్గం నిర్వహించే పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.
దీంతో బిజ్జం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయానికి బలం చేకూరింది. నంద్యాల ఎంపీ స్థానంపై బిజ్జం దృష్టి పడింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎస్పీవై రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈయన ఇక్కడ నుంచి తన అల్లుడికి అవకాశం ఇప్పించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజ్జం.. టీడీపీ టికెట్ను తనకు వచ్చేలా చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి బిజ్జం రాజకీయ అరంగేట్రం ఆసక్తిగా మారింది.