ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన కొన్ని కీలక పరిణామాల మధ్య జగన్ , పవన్ కళ్యాణ్ ఒకటయిపోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. కొంతమంది వైసీపీ నాయకులు , జనసేన నాయకులూ ప్రయత్నాలు చేసారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇదే విషయం మీద టీడీపీ నాయకులూ ఒక అడుగు ముందేసి జగన్ , పవన్ సమావేశం కూడా జరిగిందని తేల్చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఎక్కడ నుంచి వస్తాయో కానీ.. ఆ పార్టీ తరఫు నుంచి చిత్రవిచిత్రమైన ఆరోపణలు వస్తూ ఉంటాయి.
తమ ప్రత్యర్థుల విషయంలో అలివిగాని ఆరోపణలు చేస్తూ ఉంటారు టీడీపీ నేతలు. డైరెక్టుగా టీడీపీ నేత కాదు కానీ, ఆ పార్టీ సానుభూతి పరుడిగా మాట్లాడే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కొత్త విషయాన్ని చెబుతున్నాడు. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల సమావేశం జరిగిందని ఈయన అంటున్నాడు. విశాఖ వేదికగా ఈ సమావేశం జరిగిందని ఈయన చెబుతున్నాడు. వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ లు కలిసి మాట్లాడారని కూడా ఈయన చెప్పుకురావడం విశేషం. వారి మధ్య పొత్తు, సీట్ల చర్చలు జరిగాయని ఈయన చెప్పుకొచ్చాడు.
జగన్ కొన్ని సీట్లను ఆఫర్ చేశాడని.. అయితే పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పీఠం మీద కన్ను ఉందని.. అందుకే పొత్తుకు ఒప్పుకోలేదని కూడా ఈయన చెప్పుకొచ్చాడు. మరి ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ ఈయనకు ఎక్కడ నుంచి వచ్చిందో మాత్రం చెప్పలేదు. జగన్ , పవన్ లు కలిస్తే అది కులం మీద ఏర్పాటు చేసే వేదిక అవుతుందని ఈయన చెప్పుకొచ్చాడు. అదే కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలపడం మాత్రం ఒక బలమైన కూటమిని ఏర్పరచడం అని చెప్పుకొచ్చాడు!