మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్ గఢ్ లో ఈ ఉదయం తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భారీ బందోబస్తు మధ్య ప్రారంభమైంది.  ఉదయం ఏడు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమైనప్పటికీ ఓటర్లు నిర్భయంగా ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. మొత్తం 90 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో నేడు బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, కాంకేర్‌, బస్తార్‌, సుక్మా, రాజనందగావ్‌, దంతెవాడ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.


ఈ ప్రాంతమంతా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే కావడంతో పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.  కాగా, సుక్మాలోని దోర్నాపాల్‌లో వందేళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు దంతేవాడలో పోలింగ్ ప్రారంభంకావడానికి ముందు నక్సలైట్లు మందుపాతరలు పేల్చడంతో పలు రోడ్లు మూసుకుపోయాయని తెలుస్తోంది.  

Image result for chattisgarh polling

పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగనుండగా, పట్టణ ప్రాంతాల్లో 5 గంటల వరకూ పోలింగ్ సాగనుంది. 18 నియోజకవర్గాల్లో 32 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారికోసం 4,336 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు  పలు ప్రాంతాల్లో నక్సల్స్ హెచ్చరిక పోస్టర్లు అతికించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: