రాజకీయ చైతన్యం ఉన్న నెల్లూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గం రాజకీయం తాజాగా రాజుకుంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఈ టికెట్ను వైసీపీ తరఫున తాజాగా ఆ పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత, మాజీ టీడీపీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డికి కేటాయిస్తుండడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకుడు కురుగొండ్ల రామకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన తిరుగులేని విజయం సాధించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తుండడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే, దీనికి ఆదిలో ఆజ్యం పోసింది మాత్రం ఆనమే కావడం గమనార్హం.
వైసీపీ విజయభేరి పేరుతో నిర్వహించిన సభలో `వెంకటగిరిలో పోటీ స్మగ్లర్ల ఢీ` అంటూ ఆనం నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే..రామకృష్ణ కూడాతనదైన శైలిలో రెచ్చిపోయారు. డ్రామాలు ఆడటంలో ఆనం రామనారాయణరెడ్డి మాయల ఫకీరునే మించిపోతారు. వెంకటగిలో ఆనం డ్రామాలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు. జిల్లాలో డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ ఆనం సోదరులని ప్రజలకు పెద్దగా చెప్పనక్కరలేదన్నారు. రాపూరు నియోజకవర్గంగా ఉన్న సమయంలో ఆనం రామనారాయణరెడ్డిని ఆ ప్రాంత ప్రజలు రెండు దఫాలు గెలిపించినందుకు ఆ నియోజకవర్గమే లేకుండా చేశారని ఎద్దేవాచేశారు. ఈ సారి రాపూరు మండలమే లేకుండా చేస్తాడని ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు.
మంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ ద్వారా చుక్క నీరు ఇవ్వలేక పోయిన ఆయన నియోజకవర్గాన్ని డెల్టాగా మారుస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి పెద్దమనిషి ఈ ప్రాంతాన్ని డెల్టాగా మారుస్తానంటే ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. వాస్తవానికి ఆనం సోదరులపై జిల్లా వ్యాప్తంగా కూడా కొంత వ్యతిరేకత ఉంది. వారు అధికారం, పదవుల్లో ఉన్న సమయంలో జిల్లాను ఏమాత్రం పట్టించుకోకుండా సొంత వ్యవహారాలు చూసుకున్నారు. దీంతో గత రెండు సార్లుగా ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. వెంకటగిరి రాజాలు దానం చేసిన వీఆర్సీ కాలేజీని తమ ఆధీనంలోకి తీసుకుని ఆనం కుటుంబం ఆర్థికంగా ఎదిగిందనేది వాస్తవం.
ఈ విషయంలో కోర్టు కూడా అనేక సార్లు మొట్టికాయలు వేసింది. దీనికి తోడు చివర్లో వారు వరుసగా పార్టీలు మారడం కూడా మైనస్ అయ్యింది. ఇక, ఇక్కడ వరుస విజయాలతో దూసుకుపోతున్న రామకృష్ణ..కు ప్రజల్లో పాజిటివ్ స్పందన కనిపిస్తుండడం గమనార్హం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వేగంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. పైగా టీడీపీని కూడా బలోపేతం చేస్తున్నారు. దీంతో వైసీపీ ఉనికి ఇక్కడ పెద్దగా లేదు. పైగా ఇప్పుడు ఈ పార్టీ జెండాను ఆనం పట్టుకోవడంతో ప్రజల్లో ఆయనపై ఉన్న వ్యతిరేకత మొత్తం వైసీపీపై పడి మొత్తానికే ఇక్కడ వైసీపీ గందరగోళంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.