తెలంగాణలో అధికార టీఆర్ఎస్తో పాటు విపక్ష కాంగ్రెస్, మహాకూటమిలో పార్టీలు అయిన టీడీపీ, సీపీఐ, టీజీఎస్లలో సైతం టిక్కెట్లు రానివారు అసంతృప్తులు, అలకలు వీడడం లేదు. టిక్కెట్ల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు సీట్లు దక్కకపోవడంతో కొంత మంది రెబల్స్గా పోటీ చేసి తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొందరు ఇతర పార్టీల్లోకి అయినా జంప్ చేసి తమకు టిక్కెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చిన పక్షంలో వారిని ఓడించేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నెల రోజుల క్రితమే అసెంబ్లీని రద్దు చేసిన రోజే ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. కేసీఆర్ తొలి లిస్టులో తెలంగాణ వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను పెండింగ్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించినా ఇప్పటికీ కూడా 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఓ స్పష్టత రాలేదు.
ఇక నామినేషన్ల పర్వం స్టార్ట్ అవ్వడంతో కేసీఆర్ ఈ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి. ఇదే క్రమంలో ఉమ్మడి కరింనగర్ జిల్లాలోని చొప్పదండి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పేరును సైతం కేసీఆర్ పెండింగులో పెట్టారు. నెల రోజుల నుంచి తనకు టిక్కెట్ వస్తుందని ఎంతో ఆశతో వేట్ చేస్తున్న ఆమెకు ఇప్పుడు కేసీఆర్ టిక్కెట్ ఇచ్చే చాన్సులు లేకపోవడంతో ఆమె కేసీఆర్పై తిరుగుబావుటా ఎగరవేసేందుకు రెడీ అవుతున్నారు. నెల రోజుల నుంచి టిక్కెట్ తనకే వస్తుందన్న ఆశతో నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తల మద్దతు కూడకట్టుకున్న ఆమె కేటీఆర్ను కలిసి తనకు టిక్కెట్ ఇవ్వాలని విన్నమించుకున్నారు.
శోభ, కేసీఆర్ను కలవాలనుకున్నా ఆయన ఆపాయింట్మెంట్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో చొప్పదండి నుంచి పోటీ చేసిన బొడిగె శోభ తెలంగాణ ఉధ్యమం బాగా వీచిన ఉమ్మడి కరింనగర్ జిల్లాలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్యపై ఏకంగా 55వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే నాలుగున్నర ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో ఆమె కేడర్కు దూరం అయిపోయారు. నియోజకవర్గంలో శోభ కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ అవ్వడంతో సొంత పార్టీ వాళ్లే ఆమెను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నాయకులు ఆమెకు సీటు ఇవ్వొదని కేసీఆర్ను కలిసి పలు విజ్ఞప్తులు చెయ్యడంతో కేసీఆర్ శోభ సీటును పెండింగులో పెట్టారు.
సీటు కోసం నెల రోజులుగా ఆందోళనలు, ధర్నాలు చేసిన ఆమెకు సీటు రాదని క్లారిటీ రావడంతో ఇప్పుడు పార్టీ మారి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీజేపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చెయ్యాలని ఆమెపై కొంత మంది కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే సీటు దక్కని పక్షంలో బీజేపీలోకి వెళ్లి పోటీ చెయ్యడం మినహా చేసేది ఏమి లేదని పార్టీ మారడమే మంచిదన్న నిర్ణయానికి సైతం శోభ వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా నిన్నటి వరకు టీఆర్ఎస్లో ఉన్న శోభ ఇప్పుడు టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతో కేసీఆర్కు అనూహ్యంగా షాక్ ఇచ్చి బీజేపీ నుంచి పోటీ చేస్తే అది ఆసక్తికర పరిణామమే అవుతుంది.