పిల్లి కూతలకు కూడా భయపడే వారు ఉంటారా? అంటే.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు `నేనున్నానంటూ..` హాజరు వేయించుకుంటున్నారు. ఎక్కడో ఏదో జరిగితే.. ఎక్కడో ఎవరో ఏదో అంటే.. దానిని కూడా తనకు అనుకూలంగా మలుచు కుని సింపతీ సాధించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఓ విషయం వెల్లడించారు. వైసీపీ, బీజేపీ మధ్య అనుబంధాన్ని టీఆర్ఎస్ బయటపెట్టిందని అన్నారు. ఏపీ అభివృద్దిని అడ్డుకునేందుకు జగనే కేంద్రంలో ములాఖత్ అయ్యారని విమర్శించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. ఈ విషయాన్ని అసలు ఏపీతో సంబందం లేని తెల్లారి లేచింది మొదలు.. ఏపీ వారిని తిట్టిపోసే తెలంగాణా అధికార పార్టీ టీఆర్ ఎస్ కు చెందిన ఎంపీ ఒకరు అన్నారని బాబు చెప్పడం!
బాబు త్వరలోనే 70వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. తనకు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెబుతారు. అయితే, ఆయన ఈ అనుభవాన్ని ఎక్కడా వినియోగించుకుంటున్నట్టుగా లేకపోవడం గమనార్హం. ఎక్కడో టీఆర్ ఎస్ ఎంపీ ఒకరు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను పట్టుకుని తాజాగా చంద్రబాబు వేలాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జగన్ వల్ల నిలిచిపోయిందని టీఆర్ఎస్ ఎంపీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారని తెలిపారు. జగన్ ఒత్తిడి వల్లే బీజేపీ ఈ నిర్ణయం తీసుకోలేదని... ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారీ సంబంధాలకు ఇదే నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. ఆ రెండు పార్టీల అనైతిక సంబంధాల వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. అని కొత్త పల్లవి అందుకున్నారు.
టీడీపీకి మంచి పేరు వస్తుందేమోనన్న భయంతో అనేక ప్రాజెక్టులు, నిధులకు కేంద్రం నుంచి రాకుండా ఇలాగే నిలిపి వేయించారు. వారి రాజకీయ కక్షకు రాష్ట్రం నష్టపోయింది. ఈ లోపాయికారీ సంబంధాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి అని నేతలకు హితవు పలికారు. నిజానికి ఏపీలో అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతున్నదని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు.
తొలి నాలుగేళ్లు ఆయన బీజేపీతో కలిసి ఉన్న సమయంలో ఒక్క మాటైనా బీజేపీని అనలేదు పైగా బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రబాబును , టీడీపీని ఉతికి ఆరేస్తున్నా.. పట్టించుకోలేదు. కానీ, ఇంతలోనే ఈ ఆరు మాసాల్లోనే జగన్ బీజేపీతో పొత్తుకురెడీ అయ్యారని.. ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పడం బాబు విజ్ఞతను తేటతెల్లం చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా పిల్లి కూతలకు కూడా బాబు భయపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.