తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహాజనసమితి నేతలు భారీగా సీట్లు త్యాగం చేసే పరిస్థితి. కూటమిలో భాగంగా కాంగ్రెస్ 30 సీట్ల వరకు తన మిత్ర పక్షాలకు కేటాయించడంతో ఆ సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సీట్లు త్యాగం చెయ్యక తప్పని పరిస్థితి. అలాగే కనీసం 30, 35 స్థానాల్లో సంస్థాగతంగా ఇప్పటికీ కాస్తో కూస్తో ప్రభావం చూపే తెలుగుదేశంకు కేవలం తమకు 14 సీట్లు మాత్రమే ఇవ్వడంతో పలు కీలక స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేక టీడీపీ నాయకులు సైతం త్యాగం చెయ్యక తప్పడం లేదు. టీటీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ లాంటి వాళ్లు సైతం తమ సీట్లు వదులుకోక తప్పడం లేదు. అంతెందుకు కోదండరాంకు జనగామ సీటు ఇస్తే అక్కడ బీసీ అభ్యర్థిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య కోసం కోదండరాం సైతం తాను అక్కడ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీనిని బట్టీ అభ్యర్థుల త్యాగాలు మామూలుగా లేవు.
ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లోనూ టీటీడీపీకి ఎన్ని ఆఫర్లు వచ్చినా చంద్రబాబునే నమ్ముకుని తెలుగుదేశం పార్టీ వీడని ఓ సీనియర్ నేత, మాజీ మంత్రికి అదిరిపోయే ఛాన్స్ వచ్చింది. ఆ మాజీ మంత్రి ఎవరో కాదు, నిజామబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు. మండవ వెంకటేశ్వరరావు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేకుండా టీడీపీలో ఎన్నో పదవులు అధిరోహించారు. గతంలో డిచ్పల్లి నుంచి విజయాలు సాధించిన ఆయన 2009లో పునర్విభజనలో నిజామబాద్ రూరల్గా మారిన నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మండవకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి ఆఫర్లు వచ్చిన ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీని వీడలేదు. తాజా ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న 14 స్థానాల్లో మండవ నిజామబాద్ రూరల్ నుంచి బరిలోకి దిగనున్నారు.
విచిత్రం ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాకా ఈ సీటు చాలా హాట్గా మారింది. నిన్నటి వరకు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సీ భూపతి రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్తో నిత్యం ఫైటింగుకు దిగుతూ ఉండేవారు. భూపతిరెడ్డికి సీటు రాదని డిసైడ్ అయ్యాక ఆయన కాంగ్రెస్లో చేరి ఇక్కడ నుంచి అయినా సీటు వస్తుందని ఆశించారు. అలాగే టీఆర్ఎస్లో ఉన్న రాజ్యసభ సభ్యుడుడీ. శ్రీనివాస్ సైతం కాంగ్రెస్లోకి వస్తే ఇక్కడ నుంచే పోటీ చేస్తానని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ సీటును టీడీపీకి కేటాయించడంతో మండవకు ఎవరు ఊహించని విధంగా లక్ చిక్కినట్లు అయ్యింది. మండవ ఇటీవల చంద్రబాబును కలవగా తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని చెప్పడంతో ఆర్థిక వనరులు అన్నీ తాను చూసుకుంటానని అక్కడ నుంచి విజయం సాధించాలని చంద్రబాబు మండవకు చెప్పినట్టు తెలిసింది.
అలాగే చంద్రబాబు మండవ పోటీ నిజామబాద్ రూరల్లో పోటీ చేస్తుండడంతో అక్కడ మహాకూటమి నాయకులతో కలిసి ఓ భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే మండవకు ఇక్కడ సమీకరణలు బాగా కలిసి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్తో టీఆర్ఎస్లో ఉండంగా ఏ మాత్రం పొసకని ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సీటు కోసమే కాంగ్రెస్లోకి దూకారు. అయితే ఇక ఇప్పుడు సీటు దక్కకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో బాజిరెడ్డి గోవర్దన్కు వ్యతిరేఖంగా మండవకు సపోర్ట్ చెయ్యక తప్పని పరిస్థితి. అలాగే రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ సైతం పరోక్షంగా బాజిరెడ్డి గోవర్దన్ని ఓడించేందుకు మండవ వెంకటేశ్వరరావుకు సపోర్ట్ చేస్తునట్టు తెలుస్తోంది.
నిజామబాద్ రూరల్ నియోజకవర్గంలో బలంగా ఉన్న డీఎస్ అనుచర గణానికి ఇప్పటికే బాజిరెడ్డి గోవర్దన్ని ఓడకొట్టాలని సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజామబాద్ రూరల్లో ఇటు మండవ, మండవకు తోడుగా ఎమ్మెల్సీ భూపతి రెడ్డితో పాటు డీ. శ్రీనివాస్ వర్గం పరోక్షంగా సపోర్ట్ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్పై మండవ గెలుపు సులువు కానుంది. ఏదేమైన తెలంగాణలో చాలా మంది టీడీపీ సీనియర్ నాయకులకు సైతం చిక్కని లక్కు ఇప్పుడు మండవకు చిక్కింది. మరి దీనిని ఆయన ఎంత వరకు యూజ్ చేసుకుని ఈ సంగ్రామంలో విజయం సాధిస్తారో చూడాల్సిందే.