తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణా అపద్ధర్మ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చినా నారా చంద్రబాబు నాయుడు, ఏనాడూ కూడా ఒంటరిగా పోటీ చేసి గెలువలేదన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొంటే తప్ప అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు అంటూ సోమాజిగూడ ప్రెస్-క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ మాట్లాడారు. చంద్రబాబు జీవితంలో ఏనాడూ సొంతంగా పోటీ చేయలేదు. టీడీపీ పొత్తు పెట్టుకోని పార్టీయే లేదు అదీ ఒకేఒక ఏకైక పార్టీ వైసీపీ తప్ప. మిగతా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారం లోకి వచ్చాడు నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడు అని కేటీఆర్ పేర్కొన్నారు.
పోత్తు అంటే ఇద్దరూ ఒకే...ఒకే పొజిషనులో ఉండటం, అలా చూడటం పొత్తు ధర్మం, అలా కాకపోతే పొత్తే అధర్మం. కాని చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న ఏ ఒక్క పార్టీ బ్రతికి బట్ట కట్టలేదు.
చంద్రబాబు మాదిరిగా తమకు అయినదానికి కానిదానికి జబ్బలు చర్చుకునే అలవాటు లేదు. చార్మినార్కు తానే ముగ్గుపోశాను.. హైదరాబాద్ తానేకట్టాను.. కంప్యూటర్ తానే కనిపెట్టాను.. అంటూ చంద్రబాబు చెప్పుకునే స్వంత డబ్బా మాటలు విని ప్రజలు వేనోళ్ళ నవ్వుకుంటూ ఉన్నారు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనను బేరీజు వేసుకొని ఓటు వేయమని అడిగామని ఆయన తెలిపారు. చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటే కేసీఆర్ పరిణతితో పనులు చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. తమ ప్రత్యర్థి ఇచ్చిన కితాబును చంద్రబాబు లాగా ప్రచారం చేసుకునే అలవాటు తమకు లేదన్నారు. చంద్రబాబు నాయుడి సర్టిఫికేట్లు, రాహుల్ బాబు భుజకీర్తులు తమకు అవసరం లేదన్నారు.
నరేంద్ర మోదీ మాకు రాజకీయ ప్రత్యర్థి. బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేస్తుంది. 100 స్థానాల్లో బీజేపీ మాత్రం డిపాజిట్లు కోల్పోతుంది అన్నారు టీఆర్ఎస్ నాయకుడు మంత్రి కేటీఆర్. సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి 7 సర్వేలు వచ్చాయి. అందులో ఆరు సర్వేలు టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి. డిసెంబర్ 11న అసలు సర్వే ప్రజల నుండి వస్తుందన్నారు కేటీఆర్.