ఊరకరారు మహానుభావులు!- అంటారు పెద్దలు. ఈ విషయం రాజకీయాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుండడం గమనా ర్హం. రాజకీయాల్లోకి వచ్చేవారు ప్రజాసేవ చేస్తామంటే.. నమ్మే రోజులు ఏనాడో పోయాయన్న ఓ విశ్లేషకుడి మాటలు ఇప్ప టికీ నిజమేనని అనిపిస్తున్నాయి. ``నేను ప్రశ్నించడానికి వచ్చాను. నాకు అధికారం అక్కర్లేదు``- అని వేనోళ్ల వేలాది వేదికలపై గొంతు చించుకున్న నాయకులు కూడా నేడు అధికారం కోసం అంగలార్చుతున్న సంగతి కనిపిస్తోంది. నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు! అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రజాసేవకు అనే చెబుతున్నా.. దీని వెనుక ఉన్న పరమార్ధం మాత్రం అధికార లాలసే! అన్న చేయలేనిది..`తమ్ముడు` చేస్తూ.. ప్రజలను తనవైపు ఎలా తిప్పుకోవాలో నేర్చుకోమంటూ సవాలు రువ్వుతున్న సరికొత్త రాజకీయం ఏపీలో కనిపిస్తోంది.
2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి నేరుగా వచ్చిన పవన్ కళ్యాణ్.. అప్పటి ఎన్నికల్లో ఆయన పోటీకి కడు దూరంలో ఉన్నారు. అంతేకాదు, తాను ప్రశ్నించడానికే వచ్చానని పేర్కొంటూ.. చంద్రబాబుకు మద్దతు ప్రక టించి కొద్దిగా ఎన్నికలను ప్రభావితం చేశారు. రాను రాను ప్రజలకు చేరువ అయ్యేందుకు ఆయన వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అదేసమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఆ ఒత్తిడి కొన్ని సార్లు ఫలించిన అనేక విషయాల్లో చంద్రబాబు .. పవన్ డిమాండ్లను చెత్తబుట్టలో వేశారు. ఇక, 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతు న్న నేపథ్యంలో పవన్ విశ్వరూపం చూపిస్తున్నారు. రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం కోసం కొట్టుకుంటున్న నేపథ్యంలో తాను అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలను గట్టిగా అన్వేషించిన పవన్.. వాటినే గురి చూసి కొడుతున్నారు.
చంద్రబాబు ప్రబుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అదేసమయంలో చంద్రబాబు కుమారుడు లోకేష్ను టార్గెట్ చేస్తూ.. రెచ్చిపోతున్నారు. లోకేష్ను సీఎంను చేయడం కోసమే చంద్రబాబు ఇప్పుడు దేశ సంచారం చేస్తున్నారని వ్యాఖ్యానించడం ద్వారా బాబును డిఫెన్స్లో పడేశారు.ఇక, ఎమ్మెల్యేలు అందరూ చేతి వాటం చూపిస్తున్నారనిచెప్పడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం అవినీతి పంకిలం అయిపోయిందని చెబుతున్నారు. మరోపక్క, ప్రతిపక్షం వైసీపీని కూడా పవన్ బలంగానే టార్గెట్ చేస్తున్నారు. విశాఖలో జరిగిన కోడికత్తి ఘటన జగన్కు ఆయన పార్టీకి ఎక్కడ మైలేజీ వస్తుందని అనుకున్నారో ఏమో.. జగన్.. వెంటనే తీవ్రమైన విమర్శలతో జగన్పై విరుచుకుపడ్డారు.
జగన్ అసలు ఏం రెడ్డి అంటూ.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో తనకు కులం అంటగట్టద్దని చెబుతూ.. బీసీ వర్గాన్ని బుజ్జగిస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా.. తన ఇంటి పేరే కొణిదల కాదంటూ.. మరో ప్రకటన చేయడం ద్వారా.. పవన్ తన రాజకీయ వ్యూహానికి మరింత పదును పెంచారు. ఓ కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా? అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. పవన్ రాజకీయ వ్యూహం అంతా కూడా సీఎం సీటు చుట్టూతానే తిరుగుతోందని చెప్పకతప్పదు. నిజానికి చంద్రబాబు, జగన్లు సీఎం కుర్చీకోసం బహిరంగంగా పోరాడుతుంటే... పవన్ పరోక్షంగా సీఎం సీటుకోసం వీరిని మించిన వ్యూహాలతో ముందుకు పోతున్నారనడంలో సందేహం లేదని చెబుతున్నారు విశ్లేషకులు.