కూకట్పల్లి ప్రచారంపై నందమూరి ఫ్యామిలీలో చిచ్చు.. !
రాజకీయాల్లో నందమూరి ఫ్యామిలీది ఎప్పుడూ హాట్ టాపిక్కే! అది ఉమ్మడి రాష్ట్రమైనా.. ఇప్పుడు ఏపీ, తెలంగాణాలైనా సరే! నందమూరి ఫ్యామిలీ యాక్టివ్ రోల్ పోషిస్తూనే ఉంది. అదేసమయంలో హాట్ టాపిక్గా నిలుస్తూనే ఉంది. తాజాగా తెలంగాణా ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పు డు మరోసారి నందమూరి ఫ్యామిలీ విషయాలు చర్చకు వస్తున్నాయి. దీనికి తోడు నందమూరి హరికృష్ణ కుమార్తె.. సుహాసిని.. హైదరాబాద్లోని అత్యంత కీలకమైన కూకట్పల్లి నుంచి బరిలో నిలిచారు. శనివారం ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ యాక్టివ్ రోల్పై సర్వత్రా చర్చ ప్రారంభమైంది. సుహాసినికి మద్దతుగా నందమూరి కుటుంబం నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? అనే ప్రశ్న కూడా తాజాగా తెరమీదికి వచ్చింది.
2009 తర్వాత టీడీపీకి బలమైన ప్రచారం నిర్వహించిన నందమూరి ఫ్యామిలీ వ్యక్తి ఎవరూ కనిపించలేదు. అప్పటి ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించాలని కోరుతూ.. జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఖాకీ డ్రస్తో రంగంలోకి దిగిన జూనియర్ తన తాత, అన్నగారు ఎన్టీఆర్ స్టైల్ను అనుకరిస్తూ.. భారీ ఎత్తున ప్రసంగాలతోనూ దంచి కొట్టారు. అయితే, ఆ ఎన్నికల్లో వైఎస్ హవా ముందు టీడీపీ నిలవలేక పోయింది. మరోపక్క, టీడీపికి కూడా జూనియర్ దూరమయ్యారు. దీనికి ఫ్యామిలీ విభేదాలా? లేక టీడీపీ అదినేత చంద్రబాబు జూనియర్ను కావాలనే పక్కన పెట్టారా? అనే విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ఏదేమైనా 2014 నాటికి పూర్తిగా టీడీపీ జూనియర్ను పక్కన పెట్టి అదేసమయంలో పవన్ను నెత్తిన ఎక్కించుకుంది. ఏదో విధంగా అధికారంలోకి వచ్చింది.
ఇక, ఇప్పుడు మరోసారి నందమూరి ఫ్యామిలినీ చంద్రబాబు దక్కరకు తీస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో అత్యంత కీలకమైన కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె... సుహాసినికి టికెట్ ఇచ్చారు. ఫలితంగా అటు సానుభూతిని.. ఇటు రాజకీయ ప్రయోజనాన్ని కూడా చంద్రబాబు ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా పొందాలని చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సుహాసినికి టికెట్ ఇవ్వడంపై నందమూరి ఫ్యామిలీ ఆనందంగానే ఉన్నా.. వచ్చే ఏపీ ఎన్నికలు సహా ప్రస్తుత తెలంగాణా ఎన్నికల విషయంలో నందమూరి ఫ్యామిలీని వినియోగించుకునే దూర దృష్టితోనే చంద్రబాబు ఇప్పుడు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ఆయన తాజాగా తన సోదరి సుహాసిని విజయాన్ని కాంక్షిస్తూ.. తాజాగా విడుదల చేసిన లేఖలో ఎక్కడా చంద్రబాబు పేరును ప్రస్తావించకపోవడాన్ని బట్టి.. ఎన్నికల ప్రచారానికి, టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహానికి తాను దూరంగా ఉండాలని జూనియర్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. 2009లో తాను ప్రచారం చేసి.. ప్రమాదాని గురై కూడా పార్టీ అభివృద్ధిని కోరుకున్నానని, కానీ, చంద్రబాబు మాత్రం తనను ఆ తర్వాత పట్టించుకోలేదన్న భావన ఇప్పటికీ జూనియర్ను వేధిస్తోందని తరచుగా తెరమీదికి వస్తున్న అంశం. ఇలా ఎలా చూసినా.. జూనియర్ను తిరిగి టీడీపీ బాట పట్టించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదని తాజా పరిణామాలను అధ్యయనం చేస్తున్న విశ్లేషకులు భావిస్తున్నారు.