ఏమో రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ దేశానికి ఎవరూ అనుకోని వారు ప్రధానులు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు. ఇక లక్ ఉంటే జాక్ పాట్ కొట్టేసి ముఖ్యమంత్రుల సీట్లో కూర్చున్న వారిని కూడా చూశాము. అందువల్ల రేపు ఏం జరుగుతుందో చెప్పలేము
జాతకం మారుస్తుందా:
చుండ్రు (నందమూరి) సుహాసిని టీడీపీ తరఫున కూకటిపల్లి నుంచి తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె అభర్ధిత్వమే ఓ సంచలనం. సరిగ్గా మూడు నెలల ముందు తండ్రి హరి క్రిష్ణను కోల్పోయిన ఆమె ఇంతలోనే ఎన్నికల రణ రంగంలోకి వస్తారని బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలొచనలు, ఎత్తుగడల మేరకు ఆమెకు టికెట్ దక్కింది. మరి ఈ పోటీ ద్వారా అమె జాతకం మారుతుందా. పార్టీ జాతకం మార్చేస్తారా
ఆ పదవి ఇస్తారా:
తెలంగాణాలో మహా కూటమి విజయం సాధిస్తే రెండవ అతి పెద్ద పార్టీ టీడీపీయే మరి. ఆ పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి పదవిని కోరుతామని టీడీపీ నాయకులు అంటూనే ఉన్నారు. మరి అలా చూసుకుంటే చంద్రబాబు మేన కోడలు సుహాసిని కంటే దగ్గర చుట్టరికం బాబుకు లేనే లేదు. తనదైన వ్యూహల ద్వారా సుహాసినిని నిలబెట్టి తెర వెనక ఆట ఆడిస్తున్న చంద్రబాబు రేపటి రోజున ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేసి చక్రం తిప్పాలనుకోవడంలోనూ వింత లేనే లేదు. అదే జరిగితే హరి క్రిష్ణ తనయ జాక్ పాట్ కొట్టినట్లేనని అంటున్నారు.
వారికేనా పార్టీ పగ్గాలు :
సుహాసిని ద్వారా తెలంగాణాలో నందమూరి వారసత్వం కొనసాగించాలని బాబు అనుకుంటున్నారు. ఎటూ తెలంగాణాలో పార్టీ పడకేసింది. ఇపుడు కాంగ్రెస్ పుణ్యమాని నాలుగు సీట్లు దక్కితే దానిని ఆసరాగా చేసుకుని అక్కడ చక్రం తిప్పాలని బాబు భావిస్తున్నారు. లోకేష్, బ్రాహ్మణి ల ద్వారా తెలంగాణా టీడీపీని బతికించాలని బాబు అనుకున్నారు. కానీ అది జరగలేదు.
ఇపుడు హరి క్రిష్ణ కుటుంబం ద్వారా మళ్ళీ పోయిన చోట వెతుక్కుని ఉనికి చాటాలనుకోవడం బాబు ఎత్తుగడగా కనిపిస్తోంది. రేపటి ఎన్నికల తరువాతా కూటమి అధికారంలోకి వచ్చి సుహాసినికి పదవి దక్కితే తప్పకుండా జూనియర్ ఎంటీయార్ కూడా లైన్లోకి వస్తారు. అలా ఆయన సేవలను కూడా తెలంగాణాకు వాడుకుని పార్టీని పటిష్టం చేసుకోవచ్చునన్నది బాబు వ్యూహంగా కనిపిస్తోంది. మరి చూడాలి.