ఈ మద్య ఉగ్రవాదులు ఎక్కడబడితే అక్కడ విచక్షణారహితంగా దాడులకు పాల్పపడుతున్నారు. వీరి దాడుల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు..ఎంతో మంది అంగవైకల్యంతో కష్టాలు పడుతున్నారు...ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. అమృత్సర్ మరోసారి ఉగ్ర దాడితో ఉలిక్కిపడింది. దుండగులు ఆధ్యాత్మిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్లోని అమృత్సర్ జిల్లా రాజసన్సి గ్రామంలో ఆదివారం ఈ ఘటన సంభవించింది. స్థానిక ఆధ్యాత్మిక మందిరమైన నిరంకారి భవన్ వద్ద జరిగిన ఈ పేలుడులో ముగ్గురు అక్కడికక్కేడ ప్రాణాలు కోల్పోగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా, ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి పేలుడు పదార్థాలు విసిరి పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని అమరిందర్ సింగ్ పోలీసులకు సూచించారు. పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ఈ బాంబు దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని, ఆ దిశగానే దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. దాడి జరిగిన వెంటనే సీఎం అమరిందర్ సింగ్ లా అండ్ ఆర్డర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పంజాబ్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారు పారిపోతుండగా, లభించిన సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు. దాడికి పాల్పడిన వారి గురించిన సమాచారం తెలియజేస్తే రూ. 50 లక్షల రివార్డును అందిస్తామని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. బాంబు దాడిలో చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. జిల్లా అధికారులు వీరికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా సూచించారు. కాగా, సీసీటీవీ ఫుటేజ్ వివరాల ప్రకారం, వీరిలో ఒకరు జీన్స్, షర్ట్ ధరించగా, మరొకడు కుర్తా పైజమా వేసుకుని ఉన్నాడు. వీరిద్దరి ముఖాలకూ మాస్క్ లు ఉండటంతో వీరెవరన్నది స్పష్టంగా తెలియడం లేదు.