ముఖ్యంగా బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ వేస్తున్న ప్రతి అడుగులోనూ నిర్ణయాల్లో పార్టీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకుంటూ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నమ్మినబంటుగా అతి తక్కువ కాలంలోనే పేరుతెచ్చుకున్నారు దానం నాగేందర్. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రాముఖ్యమైన నియోజకవర్గమైన ఖైరతాబాద్ లో దానం నాగేందర్ తెలంగాణ లో జరగబోయే రెండో అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీకి దిగారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గం లో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం టి ఆర్ ఎస్ పార్టీ యొక్క భావజాలాన్ని..కెసిఆర్ పథకాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ దూసుకెళ్ళిపోతున్న దానం నాగేందర్.. ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు.
తనకు పోటీయే లేదని, 50వేల మెజారిటీతో గెలవడం ఖాయమని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయం అన్నారు. ఈ నాలుగేళ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన సంక్షేమ, అభివృద్ది పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. ఇతర పార్టీల అభ్యర్థల లాగా.. ఎన్నికల్లో తాను డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు నాగేందర్. ప్రజలు తనకు పట్టం కట్టడానికి కేసీఆర్ అమలుచేసిన పథకాలు చాలన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తనకే మద్దతునిస్తున్నారని, బస్తీల్లో జనమంతా కారుకే ఓటు వేస్తామని చెబుతున్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్లో అసమ్మతి లేదని, ఎన్నికల బరిలో పార్టీ రెబల్స్ ఉండరని అన్నారు.భవిష్యత్తులో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో 15వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వబోతున్నట్టు వెల్లడించారు. ఇక్కడి ప్రజలు సమర్థవంతుడైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని, వారంతా తనకు ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు. రెండోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ యే బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోష్యం చెప్పారు దానం నాగేందర్.