తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు తాజా మాజీ మంత్రులు తమ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన వ్యతిరేఖత ఎదుర్కొంటున్నారు. ములుగు నుంచి పోటీ చేస్తున్న అజ్మీరా చందూలాల్, తాండూరు నుంచి పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి, సనత్నగర్లో పోటీ చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, జడ్చర్లలో పోటీ చేస్తున్న లక్ష్మారెడ్డి, నిర్మల్ నుంచి పోటీ చేస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి వీరందరకి నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేసీఆర్ క్యాబినేట్లో మంత్రిగా ప్రాధినిత్యం వహించిన తాజా మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్కు నియోజకవర్గంలో తీవ్రమైన ఎదురు గాలి వీస్తున్నట్టు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగున్నర ఏళ్లపాటు మంత్రిగా కొనసాగిన ఆయన తన శాఖకు వన్నె తెచ్చింది లేదు.. ఇటు నియోజకవర్గానికి చేసిందేమి లేదని నియోజకవర్గ జనాలు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మినహా తన నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు విషయంలో ఆయన ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయారు. గిరిజన, ఆదివాసిలకు అందాల్సిన సంక్షేమ పథకాలు సైతం ములుగు నియోజకవర్గంలో గత నాలుగున్నర ఏళ్లుగా అందలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఏ నియోజకవర్గంలో లేనంత అధ్వానంగా అమలు అయ్యిందన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు మంత్రి కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ వ్యవహారంపై నియోజకవర్గ జనాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. మంత్రి కుమారుడు అవినీతి వ్యవహారాలు ఆయనకు ప్రధానమైన మైనస్గా మారాయి.
ఇక ప్రధానంలో ములుగు జిల్లాను సాధించుకోవడంలో ఆయన ఘోరంగా విఫలం అయ్యారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుల్లో చాలా మంది జిల్లాల సాధనలో సక్సెస్ అయినా కీలకమైన ములుగు జిల్లా ఏర్పాటు విషయంలో చందూలాల్ ఏ మాత్రం చొరవ చూపలేదు సరికదా ములుగు జిల్లా సాధన కోసం ఉద్యమించిన వాళ్లపై సైతం బెదిరింపులకు దిగడాన్ని నియోజకవర్గ జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే నియోజకవర్గంలో లంబాడ, ఆదివాసి తెగల మధ్య నెలకొన్న వివాదం సైతం చందూలాల్కు శరాఘాతంగా మారిందని తెలుస్తోంది. లంబాడ తెగకు చెందిన ఆయన ఆదివాసిలను కొంత దూరం పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే టైమ్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సీతక్క ఆదివాసి కావడం ములుగు నియోజకవర్గంలో ఎక్కువ మంది ఆదివాసీలే ఉండడంతో ఇది కూడా చందూలాల్కు మైనెస్గా మారనుంది.
2009 ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్కపై క్లీన్ ఇమేజ్ ఉంది. ఆమెకు అటు కాంగ్రెస్లో పాత, కొత్త శ్రేణులతో పాటు టీడీపీ నుంచి చేరినవారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు మంత్రి చందూలాల్పై ఉన్న తీవ్రమైన వ్యతిరేఖత సైతం సీతక్క తనకు అనుగుణంగా మలుచుకుంటోంది. ఏదేమైనా ప్రస్తుతం ములుగులో ఉన్న రాజకీయ వాతావరణాన్ని బట్టీ చూస్తుంటే అజ్మీరా చందూలాల్ గెలుపు అంత సులువు కాదని తేలుస్తుండంగా సీతక్కకు అక్కడ అనుకూల వాతావరణం కనపడుతోంది. తుదిఫలితం ఎలా ఉంటుందో డిసెంబర్ 7వరకు వేట్ చెయ్యాల్సిందే.