ఎన్టీఆర్ సోదరి సుహాసిని భరిలోకి దిగటం తో ఎన్టీఆర్ ఇప్పడూ ప్రచారం చేయాలా ... వద్దా అని సందిగ్ధం లో పడి పోయాడు. అయితే 2014 ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి టీడీపీనే గెలిచింది. కానీ, గెలిచిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈసారీ కూకట్పల్లిలో తామే గెలుస్తామన్న గట్టి నమ్మకంతో వున్న టీడీపీ, గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించకూడదంటే, ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే టీడీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి వుండాలని భావించిందని అర్థం చేసుకోవాలేమో.కారణాలేవైతేనేం, పెద్దగా ఎవరికీ పరిచయం లేని సుహాసినిని అనూహ్యంగా చంద్రబాబు తెరపైకి తెచ్చారు.
ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ల సోదరి. బాబాయ్ బాలకృష్ణ స్వయంగా సుహాసిని నామినేషన్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. అదీ చంద్రబాబు డైరెక్షన్లో. చంద్రబాబు, బాలకృష్ణల ప్రచారం కూకట్పల్లిలో దాదాపు ఖరారైంది. కళ్యాణ్రామ్ కూడా ప్రచారానికి వస్తాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ప్రచారానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదట. 'వారి వారి సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ని బట్టి ప్రచారానికి రావడం, రాకపోవడం అనేది ఆధారపడి వుంటుంది..' అని బాలకృష్ణ ఇప్పటికే ఓ మాట అనేసి వున్నారు. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ స్టార్ట్ అయ్యింది గనుక, ఆ వంకపెట్టి ఎన్టీఆర్, ప్రచారానికి 'డుమ్మా'కొట్టడం ఖాయంగానే కన్పిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్తో ట్విట్టర్లో సుహాసినికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించాలని టీడీపీ భావిస్తోంది. మరోపక్క, ఎన్టీఆర్తో ఓ వీడియో బైట్ని కూడా ప్లాన్ చేస్తున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ సంగతి పక్కన పెడితే, ఒకే ఒక్క నియోజకవర్గం.. అదీ తన సోదరి కోసం జూనియర్ ఎన్టీఆర్ కాస్తయినా సమయం కేటాయించుకోలేడా.? ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనలేడా.? అని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం, ఇంకోసారి చంద్రబాబు రాజకీయ అవసరాలకు బలైపోవద్దని సోషల్ మీడియా వేదికగా సలహాలిస్తున్నారు.. బతిమాలుకుంటున్నారు.. సున్నితంగా హెచ్చరిస్తున్నారు కూడా.