టీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి... తన కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు. కాంగ్రెస్లో చేరికతో పాటు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించనున్నారు. 2013 లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ నుండి పట్నం మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నం, పట్నం నరేందర్ రెడ్డిలు టీఆర్ఎస్లో చేరారు. రెండేళ్ల క్రితమే విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో కొన్ని కారణాలతో ఈ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు.
కొండాను పార్టీకి రాజీనామా చేయొద్దని కేటీఆర్ సైతం ఎంతో నచ్చజెప్పినట్లు సమాచారం. అప్పటికే పార్టీని వీడాలని నిర్ణయించుకున్న ఆయన, "పార్టీ నుంచి బహిష్కరిస్తే బహిష్కరించుకోండి" అని గట్టిగానే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో తన పట్ల వివక్ష సాగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయంతో ఉన్నారు. మహేందర్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయంతో ఆయన కూడ ఉన్నారు.
పట్నం సోదరులు టీఆర్ఎస్లో చేరిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి హవా ప్రారంభమైంది. ఈ పరిణామం విశ్వేశ్వర్ రెడ్డికి నచ్చలేదు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడ వివరించారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో విసుగు చెందిన కొండా పార్టీని వీడటానికి బలమైన కారణం అయ్యిందని సన్నిహితులు చెబుతున్నారు.
భవిష్యత్తులో కూడ తమకు ఇబ్బంది ఉంటుందని భావించి విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు , ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 23వ తేదీన మేడ్చల్ లో నిర్వహించే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సభలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. నేడు ఆయన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖను ఇవ్వనుండగా, దాన్ని వెంటనే ఆమోదిస్తారని సమాచారం. ఆపై మీడియాతో మాట్లాడేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిర్ణయించుకోవడంతో, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది.