గత కొంత కాలంగా ప్రభుత్వ అధికారులు చేస్తున్న తప్పులు వల్ల ఎంతో మంది తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో హాల్ టిక్కెట్లపై సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారి ఫోటోలు రావడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా మహాకూటమి తరఫున కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి వెంకట సుహాసిని ఓటరు కార్డులో ఆమె భర్త స్థానంలో తండ్రి హరికృష్ణ పేరు నమోదైంది.
నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోగా, ఓటరు కార్డులో భర్త పేరు ఉండాల్సిన చోట సుహాసిని తండ్రి నందమూరి హరికృష్ణ పేరును ప్రింట్ చేశారు. ఆమె భర్త చుండ్రు వెంకట శ్రీకాంత్ అన్న సంగతి తెలిసిందే. వివాహితురాలైన సుహాసిని, తన ఓటరు కార్డులో భర్త ఇంటి పేరుకు బదులుగా పుట్టింటి పేరైన నందమూరినే ఉంచుకున్నారు. ఆమె అఫిడవిట్లో హరికృష్ణను తండ్రిగానే పేర్కొన్నారు.
అయితే అఫిడవిట్తో పాటు ఓటరుగా నమోదైనట్లు తెలియజేసేందుకు సమర్పించిన ఓటరు జాబితా సర్టిఫైడ్ కాపీలోనూ తండ్రి పేరు అని ఉన్న చోట భర్త పేరుగా హరికృష్ణ పేరుతోనే జారీ చేశారు. నాంపల్లి నియోజకవర్గంలోని ఎన్నికల జాబితా పార్ట్నెంబర్ 48, సీరియల్ నెంబర్ 710 ఓటరుగా ఆమె పేరు నమోదైంది. ఇదే విషయాన్ని రిటర్నింగ్ అధికారి మమత దృష్టికి తీసుకెళ్లగా... ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని, అలాంటి వాటితో నామినేషన్ను తిరస్కరించలేమని స్పష్టం చేశారు.