ప్రతిపక్షనేత వైఎస్ జగన్మొహనరెడ్డి సంకల్పించిన "ప్రజా సంకల్ప యాత్ర" ఒక జైత్రయాత్రలా కొనసాగుతుంది. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపరేషన్ గరుడ ఇంకా ఏవో రాక్షస ద్రవిడ అని పెద్ద యాగీ చేస్తుంటారని, దీనిపై ఒకటే అడుగుతున్నానని, టీవీలలో మోగించే ఆ మోతలేమిటి?, ఇన్ని సార్లు డిల్లీ వెళ్లినప్పుడు దీనిపై రాష్ట్రపతిని విచారణ చేయాలని ఎందుకు కోరడం లేదు” అని విపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు.
దీనిపై సుప్రిం కోర్టుకు ఎందుకు వెళ్లరు? అని అన్నారు. దీనిపై ఎందుకు కేసు పెట్టరు? అని ప్రశ్నించారు. దీనికి కారణం ఏమిటంటే విచారణ జరిగితే చంద్రబాబే దొంగ అని తేలుతుందని, అందుకే విచారణ అడగడం లేదని ఆయన ముక్తాయింపుగా అన్నారు.
ఆరునెలల నుండి ఐటి, ఈడి రెయిడ్లు అంటూ ఇలలోనే కాదు కలలో కూడా జడుసుకుంటూ, అప్పుడప్పుడు తనకు తానే భుజాలపై చరుసుకొని ధైర్యం చెప్పుకుంటూ - సుప్రిం కోర్టుకు వెళతానంటూ ఉన్నారని, అంటూ అసలు ముఖ్యమైన ప్రత్యేక హోదా పై సుప్రిం కోర్టుకు ఎందుకు వెళ్లరు? - కాని ఆయన అనుయాయుల దోపిడిని ఆపాలని మాత్రం కోర్టుకు వెళతారట – దీన్ని బట్టి ఆయన పరిపాలన ఆయన అనుయాయుల అనుకూలుర సంరక్షణ కోసమేనా? అని యెద్దేవా చేశారు.
ఒక వేళ రాష్ట్ర హైకోర్టుగాని, భారత సుప్రిం కోర్టుగాని నారా చంద్రబాబు నాయుడు అవినీతిపై విచారణకు ఆదేశిస్తే, హైకోర్టు, సుప్రిం కోర్టులు రెండింటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని గాని రాష్ట్రంపై గాని ఆదేశాలు ఇచ్చే పరిది వాటికి లేదని అంటారని వైఎస్ జగన్మోహనరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ సమస్యలు పట్టవు కాని, కేంద్ర సమస్యలు దేశ సమస్యలు ఆపై అంతరిక్ష సమస్యలు మాత్రం చూస్తానంటున్నారని అన్నారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలవరపాటుకు గురయ్యేలా జనసేనాని పవన్ కళ్యాణ్ మరోపక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న కొత్త ప్రయత్నం గురించి ఆయన ఎత్తిపొడుస్తూ మరోమైపు చంద్రబాబు కుటుంబ రాజకీయాలను నిశితంగా విమర్శించారు. తమిళనాడులో పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాన్ చెన్నై వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. జనసేన కార్యకర్తలు - పవన్ అభిమానులు తరలివచ్చి ఆయనకు ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా విశ్వనటుడు కమల్ హాసన్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాటాడుతూ అందరికీ నమస్కారం అంటూ తమిళంలో ప్రసంగం ప్రారంభించారు. తన పేరు పవన్ కల్యాణ్ అని పరిచయం చేసుకున్న జనసేన అధినేత 2014లో జనసేన పార్టీని ప్రారంభించినట్టు చెప్పారు. 20ఏళ్లు చెన్నైలో ఉన్నప్పటికీ తన తమిళభాష విషయంలో ఏమైనా తప్పులుంటే క్షమించాలని పవన్ కోరుతూ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
చెన్నైలో ఆంధ్రులు ఎప్పుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగా లేరని, కానీ ఏ తప్పు లేకపోయినా ఆంధ్రా ప్రజలు తెలంగాణలో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తూ బాధపడ్డారని గుర్తు చేసు కున్నారు. కానీ ఇప్పుడు ఏపిలో సరైన రీతిలో అభివృద్ధి జరగడం లేదన్నారు. చంద్రబాబు విషయంలో కాసింత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
ఆయన ఎప్పుడు స్నేహితుడుగా ఉంటారో? ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో? చెప్పడం కష్టమని, ఆయనో చపలచిత్తుడనే తరహాలో — ఆయనతో రాజకీయ ప్రయాణం ప్రమాదకరం అని అన్నారు. టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తే, కూడా జరిగింది శూన్యమన్నారు.
వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదని, తాము స్వతంత్రంగా పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాన్ స్పష్టం చేశారు. ఏపీలో త్రిముఖ పోటీ జరగనుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వయసు మళ్లితే ఆయన కుమారుడు లోకేష్ నాయునికి జనం మద్దతు ఏమాత్రం లేదన్నారు. బాబు నేతృత్వంలో ఏర్పడుతున్న మహాకూటమి విఫలం అవుతుందన్నారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి మూడో ఫ్రంట్ తయారు చేస్తామని చెప్పారు. దేశ రెండో రాజధానిని వెంటనే దక్షిణ భారతదేశంలో పెట్టాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. దక్షిణాది అంతా ఒక్కటవ్వాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.