తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు నువ్వానేనా అనే విధంగా పోటీ పడి ప్రచారాలు కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు ఇతర నేతలు ప్రత్యర్థి వర్గంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న టీ కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి ద్వారా తెలంగాణ ఎన్నికల బరిలోకి వచ్చిన టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విషయంపై రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి.
నేడు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననుండగా, ఇదే సభలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించనుంది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు సోషల్ మీడియాలో లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, మేనిఫెస్టో లోని ముఖ్యంశాలు.. అధికారంలోకి వస్తే, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ. 3 వేల నెలసరి భృతి, బీసీలకు సబ్ ప్లాన్ అమలు మేనిఫెస్టోలో ఉన్నట్టు సమాచారం.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అద్దె ఇంట్లో ఉంటున్న పేదలకు సంవత్సరానికి రూ. 50 వేలు ఇస్తామని తెలపనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, రెండు విడతల్లో ఫీజు రీయింబర్స్ మెంట్, అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు అన్న అంశాలను చేర్చినట్టు తెలుస్తోంది.
అంతే కాదు జర్నలిస్టులకు రూ. 200 కోట్లతో సంక్షేమ నిధి, 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేలా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తదితర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. కాకపోతే ఈ వివరాలు గత కొంత కాలంగా టికాంగ్రెస్ పార్టీ అధినేతలు అంటూనే ఉన్నారు..కానీ క్లారిటీ రాలేదు. మేడ్చల్ లో జరిగే భారీ బహిరంగ సభలో ఈ విషయాలు వెల్లడిస్తారని సమాచారం.