కర్నూలు జిల్లా కర్నూలు అసెంబ్లీ నియజకవర్గం టీడీపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక్కడ టీడీపీలోని రెండు కుటుంబాల మధ్య పాలిటిక్స్ పెను ప్రకంపనలకు దారితీస్తోంది. ముఖ్యంగా సీనియర్ మోస్ట్ కు జూనియర్ మోస్టుకు మధ్య హోరా హోరీ మాటల యుద్ధం సహా.. నువ్వా_నేనా అనే రేంజ్లో రాజకీయం జరుగుతోంది. దీంతో ఇక్కడి రాజకీయాలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా అమరావతిలోనూ సంచలనంగా మారాయి. విషయంలోకి వెళ్తే.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన టీజీ ఫ్యామిలీ.. టీడీపీలోనే ఉన్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు టీజీ భరత్ను కర్నూలు ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించి గెలిపించుకోవాలని టీజీ వెంకటేష్ ప్లాన్ చేసుకున్నారు.
అయితే, ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎస్వీకే మళ్లీ టికెట్ ఇస్తామని కొన్నాళ్ల కిందట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి లోకేష్ ప్రకటించారు. దీంతో ఎస్వీ ఈ టికెట్ తనదేనని భావిస్తున్నారు. అయితే, వాస్తవానికి టీడీపీలో సీట్ల కేటాయింపు సర్వే ప్రకారం జరుగుతోంది. చివరి నిమిషం వరకూ సీటు ఎవరికిస్తారనే విషయం రహస్యంగా ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా ముందుగానే కర్నూలు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మళ్లీ పోటీ చేస్తారని నారా లోకేష్ స్వయంగా ప్రకటించడంపై ఎంపీ టీజీ భగ్గుమన్నారు. సీటు ప్రకటించడానికి అసలు లోకేష్ ఎవరంటూ మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందనా రాలేదు. అంటే.. ఎస్వీ విషయంలో క్లారిటీ లేదని టీజీకి స్పష్టమైంది.
దీంతో టీజీ వెంకటేష్, ఆయన తనయుడు భరత్లు మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. నగర ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకు విజన్ యాత్ర పేరిట భరత్ ఓ యాత్ర ప్రారంభించి మండలాలు, వార్డులు చుట్టేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని యాత్ర ప్రారంభం సందర్భంగా టీజీ భరత్ ప్రకటించారు.పరోక్షంగా ఎమ్మెల్యే అవినీతిపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. నగర ప్రజలు అవినీతి లేని అభివృద్ధి కోరుకుంటున్నారని, గతంలో తాము అదే చేశామని అంటున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ యాత్రను వెంటనే ఆపేయించాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి విన్నవించారు.
కర్నూలు నియోజకవర్గం నుంచి ఇప్పటికే తన పేరు ప్రకటించిన నేపథ్యంలో భరత్ యాత్ర వల్ల కేడర్లో గందరగోళం ఏర్పడడమే కాకుండా అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతోందని వివరించినట్లు సమాచారం. అయితే, యాత్ర ఆపేయాలంటూ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలూ టీజీకి కానీ, ఆయన కుమారుడికి కానీ చంద్రబాబు నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో మరింత జోరు పెంచేందుకు టీజీ భరత్ సిద్ధమవుతున్నారు. ఇక, ఇప్పుడు ఈ అంశంపై చర్చ నడుస్తోంది. నిజానికి చంద్రబాబుకు ఎస్వీకి టికెట్ ఇవ్వాలని అనుకుంటే.. ఏదో ఒక ఆదేశం ఇచ్చి ఉండే వారని, కానీ, బాబు మౌనంగా ఉన్నారంటే, ఆయన భరత్ పక్షానికే మార్కులు వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో భరత్ మరింత దూకుడు పెంచే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.