తెలంగాణలో ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రచారాల జోరు కొనసాగుతుంది. గల్లీ గల్లీలో ప్రచార వాహనాలతో సందడి నెలకొంది. టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఈ ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. నిన్న మేడ్చెల్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహూల్ గాంధీ, సోనియా గాంధీ తమ స్పీచ్ తో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు టికాంగ్రెస్ వరాల జల్లులు కురిపించారు.
‘మహాకూటమి’అధికారంలోకి వస్తే..రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటి అద్దెల నుంచి ఊరట కలిగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో ఎక్కువగా జాప్యం లేకుండా ‘వన్ టైం రెంట్ రీయింబర్స్మెంట్’ రూ.50 వేలు ఇస్తామని, ప్రజా కూటమి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని అందిస్తామన్నారు. అలాగే, దరఖాస్తుదారులకు ఏడాదిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.
అంతే కాదు ఈ పథకానికి కొత్త పేరు కూడా పెట్టారు..అదే ‘మా ఇంటి వెలుగు’. గత నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందని..ఎంతో మంది ఈ పార్టీలో మనుగడ సాగించలేక విసుగెత్తి పోయారని..ఒకటి రెండు రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్లో చేరికలు ఉంటాయన్నారు.
ఇప్పటి వరకు కేసీఆర్ తెలంగాణ ముసుగు వెనక ఉన్న అధికార, ధన దాహం ఇన్నాళ్లకు బయటపడిందని, కేసీఆర్ నియంతృత్వం నుంచి విముక్తి పొందేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. మహాకూటమికి ఓటేసి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఓట్లుకు విజ్ఞప్తి చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.