ఈ భాష ఎవరిదో హెడ్డింగ్ చూసే చెప్పగలరు భాగ్యనగర్ వాసులు. ఎంతటివారైనా తమ ముందు పాదాక్రాంతులే! ఇది ఆయన సభ్యత సంస్కారం. నడినెత్తినెక్కి తైతిక్క లాడుతున్న ఆహానికి అహంకారానికి నిదర్శనం.
*ఎవరైనా తమ ముందు తలవంచాల్సిందే నని
*నేను బాద్షాను కాదు. కానీ కింగ్ మేకర్ ని అని
*ఎవర్నయినా సీఎం పీఠంపై కూర్చోబెట్టగలనని,
* సీఎం పీఠంపై నుండి దించేయడమూ చేయగలనని
మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పాతబస్తీ బండ్లగూడ మహ్మద్ నగర్లో శుక్రవారం రాత్రి జరిగిన మజ్లిస్ పార్టీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పై విధం గా అహంభావం అహంకారం ప్రతిధ్వనించే పలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు రాహుల్ గాంధి - కాంగ్రెస్, నరేంద్ర మోదీ- బిజెపిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. డిసెంబరు 11న కింగ్ మేకర్ ఎవరో తేలిపోతుందన్నారు.
మేము ఐదు రోజులు రాష్ట్రమంతా పర్యటిస్తే తెలంగాణలో మా గాలి వీస్తుందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తా. గాంధీ టోపీ ధరించే బానిసలారా! గాంధీకే గులాములారా! మీకు ఇదే నా హెచ్చరిక. సోనియా గాంధి దగ్గర గులాంగిరీ చేయాల్సిన ఖర్మమాకు పట్టలేదు. సఖ్యత కోసం ఆనాడు ఇందిరా గాంధీ దారుస్సలాంకు వచ్చారు. మజ్లిస్ పార్టీ శక్తి అది. అని వ్యాఖ్యానించారు. అవసరం ఉంటే మీ నానమ్మ (ఇందిరా గాంధీ) లాగా మీరు కూడా 'దారుస్సలాం' కు రావాల్సిందేనని రాహుల్ గాంధీకి పరోక్షంగా సూచించారు.
*మజ్లిస్ పార్టీ ఎవరినీ లెక్క చేయదని, ఎట్టి పరిస్థితుల్లో భయపడదన్నారు.
*సందర్భం వస్తే ఒక ప్రక్క నరేంద్ర మోదీ తో మరో ప్రక్క రాహుల్ గాంధీ తోనూ పోరాడతామని హెచ్చరించారు.
*దేశానికి కాంగ్రెస్, భాజపాలే ప్రత్యామ్నాయమా?
*వాటితో జత కలిస్తేనే మా మాట వింటాయా? అని ఎదురు ప్రశ్నించారు.
*తాము ఎవరో ఒకరితో స్నేహం చేస్తామనే భావన కాంగ్రెస్, భాజపాలకు ఉందని, అందుకే ప్రత్యామ్నాయంగా మూడో శక్తికి జీవం పోస్తున్నామని తెలిపారు.
*ఒకరు తమాషా చేస్తే మరొకరితో జతకట్టడమే, మజ్లిస్ రాజకీయమని స్పష్టం చేశారు. అందుకే బండి (కారు) ని నెట్టమని కోరుతున్నామని పరోక్షంగా తెరాసతో ప్రస్తుతం స్నేహం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.
*తనను తాను చాయ్వాలా! అని చెప్పుకోవడం మానెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. ‘గతంలో చాయ్వాలా! కావొచ్చు, ప్రస్తుతం దేశ ప్రధాని’ అన్న విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.