ఇన్నాళ్ళూ చేవెళ్ళ కి ఎంపీ గా తన సేవలు అందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి రీసెంట్ గా తెరాస నుంచి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ సమక్షం లో ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అయితే కొండా వెళ్ళిపోవడం అనేది తెరాస కి ఖచ్చితమైన దెబ్బే అంటూ పొలిటికల్ విశ్లేషకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. కొండా గత ఎన్నికల్లో గెలుస్తారు అని కెసిఆర్ కూడా నమ్మలేదు. తెరాస కి చేవెళ్ళ లో సీటు అంటే వదులుకునే పరిస్థితే ఉంది. కానీ తనదైన క్యాడర్ తో బలమైన నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు కొండా.
2014 ఎన్నికల్లో అనుచరులతో కలిసి విపరీతంగా ప్రచారం చేస్తూ, సుడిగాలి పర్యటనలు చేస్తూ తెరాస కి ఆశలు కూడా లేని ప్రాంతం లో బలమైన ఎంపీ సీటు అందించారు ఆయన. కేంద్రం తో డీలింగ్ అప్పుడు ఎంపీ సీట్లు ఏ పార్టీ కి అయినా చాలా దోహద పడతాయి ఆ క్రమం లో కొండా అందించిన సీటు తెరాస కి ' ఆస్తి ' అనే చెప్పాలి. ఆ ఆస్తి ని కోల్పోయారు కెసిఆర్ ఇప్పుడు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి యొక్క అసలు బలం ఏంటి అనేది ఇప్పుడిప్పుడే తెరాస అర్ధం చేసుకుంటోంది.
ఆయన బయటకి వెళ్ళిన తరవాత ఆయన లోక్ సభ పరిధిలో ఉన్న అసంబ్లీ సెగ్మెంట్లు అన్నింటా ఈ ప్రభావం కనిపిస్తోంది తెరాస కి. కొండా దెబ్బకి మహేశ్వరం , రాజేంద్ర నగర్ , సేర్లింగం పల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు .. ఇలా అన్ని చోట్లా తెరాస క్యాడర్ పక్కకి ఒరిగిపోయింది. ముఖ్యంగా వికారాబాద్, తాండూరు లలో సిట్టింగ్ తెరాస సీట్లు దక్కడం గగనం గా మారిపోయింది తెరాస పార్టీ కి. రాజేంద్ర నగర్, మహేశ్వరం లాంటి చోట్ల మహా కూటమి కి చాలా బలం వచ్చేసింది.
ఒకే ఒక్క రాజీనామా ఒక లోక్ సభ పరిధి లోని నియోజికవర్గాలని ఇంతగా ప్రభావితం చెయ్యగలదా అని ఆశ్చర్యపోతున్నారు విశ్లేషకులు. ఏడు అసంబ్లీ సెగ్మెంట్ లలో ఏడూ మహాకూటమి కి రావచ్చు అనే అంచనాలు ఉన్నాయి .. కొండా రాజీనామాకి ముందు ఒక లెక్క తరవాత ఒక లెక్కా అన్నట్టు ఉంది పరిస్థితి. ఇలాంటి విశ్లేషణలు నిత్యం తన టేబుల్ మీదకి తెప్పించుకునే రాహుల్ గాంధీ సైతం ఇలాంటి లెక్కలు చూసి సంతోష పడుతున్నారట.