పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు ప్రదర్శించి, మంత్రిగా కూడా చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ త్వరలోనే వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్నే నమ్ముకుని ఉన్న ఆయన ఈ మధ్యనే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. తెలుగుదేశంతో పొత్తు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తమలాంటి వారికి ఏ మాత్రం అంగీకారం కాదని అప్పట్లోనే వసంత్ తెగేసి చెప్పారు. అప్పటి నుంచి తన శ్రేయోభిలాషులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తూనే, ఉంగుటూరు నియోజక వర్గానికి చెందిన అభిమానులు, జిల్లాలో తనతో సాన్నిహిత్యంగా ఉంటున్న కొందరు నేతలతో త్వరలోనే భేటీ కావాలని తాజాగా నిర్ణయించారు.
ఈ భేటీలోనే తన భవితవ్యాన్ని నిర్ధారించుకునే వీలుగా కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీకి చేరువ అవుతారా.. లేదా వైసీపీకి దగ్గర కానున్నారా..? అనే అంశాలపై జిల్లాలో సాగుతున్న ప్రచారానికి నేరుగానే పుల్స్టాప్ పెట్టబోతున్నారు. ఈ రెండు పార్టీల్లో ఏదొక దానిలో చేరడం, నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనే తన ఆకాంక్షను అభిమానుల ఎదుటే వ్యక్తీకరించి ఆ తదుపరి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలో ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్కు దూరం అవుతారని అంచనా వేసినా దీనికి విరుద్దంగా కాంగ్రెస్లో మిగిలిన సీనియర్లందరూ వసంత్కు దూరంగానే మిగిలిపోయారు. త్వరలో జరగబోతున్న భేటీకి హాజరు కావాల్సిందిగా వసంత్కు సన్నిహితులుగా ఉన్న వారందరికీ వర్తమానం అందింది. కాగా, వట్టి.. జగన్ చెంతకు చేరే అవకాశమే ఎక్కుగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. జనసేనలో చేరినా అది రాంగ్ స్టెప్పే అవుతుంనద్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు సమాచారం.
పైగా.. పవన్కు ఎక్కడా క్లారిటీ లేదు. ఆయన వ్యవహారశైలిపై మేధావులు సైతం విస్తుపోతున్నారు. పార్టీలో ఇప్పటికీ క్లారిటీ లేదు. కొంత సేపు తాను సీఎం కావాలని అనుకుంటున్నానని పవన్ చెబుతున్నాడు. మరికొంత సేపు ఇది బాధ్యతతో కూడుకున్నదని అంటున్నారు. మరి సీఎం కావాల్సిన నాయకుడు పార్టీని ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పటిష్ట పరిచింది కూడా లేదు. ఇక, నియోజకవర్గ స్థాయి నాయకులే దిక్కులేనప్పుడు జనసేన ఎలా ప్రజల్లోకి వెళ్తుందో పవన్కే తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి అన్నీ ఆలోచించే చంద్రబాబుకు తాను 2014లో మద్దతిచ్చానని చెబుతున్న పవన్.. మరి ఇప్పుడు ఆయన ఇలా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? అంత అవినీతి బాబు చేస్తున్నప్పుడు.. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఎందుకు నిలదీయలేక పోతున్నారు? కేవలం ప్రజల మధ్య వచ్చి వారిని మభ్య పెట్టేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్కు క్లారిటీ లేదనేది చాపకింద నీరులా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాయకులకు కనిపిస్తున్న ఆల్టర్నేట్ నాయకుడు జగన్ మాత్రమే. పైగా 2004లో వట్టి వసంత కుమార్కు వైఎస్ రాజశేఖరరెడ్డి టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ ఉంగుటూరు నుంచి గెలిచేందుకు కూడా వైఎస్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ రుణం తీర్చుకునేందుకైనా కూడా ఆయన జగన్ చెంతకే చేరతారని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా వసంత్ కొద్ది రోజులుగా జనసేనలోకి వెళతారని ఊరించి ఊరించి ఎట్టకేలకు వైసీపీలోకి వెళుతున్నట్టే తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.