వంగలపూడి అనిత.. విశాఖ జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే. టీడీపీ టికెట్పై గత ఎన్నికల్లో విజయం సాధించిన ఈమె సెంటిమెంట్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. తన నోటి దురదో మాటలు అనేసి.. తర్వాత ఎవరైనా .. తనపై వ్యాఖ్యలు చేస్తే..`నేను దళిత మహిళను, ఒంటరిదాన్ని`` అనేగా కామెంట్లు చేస్తున్నారు.. అంటూ.. కన్నీరు మున్నీరయ్యేలా శోకణ్నాలు పెట్టడం ఈమెకు రివాజు. చంద్రబాబు పాలనలో మంత్రి వర్గంలో సీటు ఆశించిన దళిత ఎమ్మెల్యే కూడా ఈమె. అయితే, అది కుదరకపోవడంతో విజిటింగ్ ఎమ్మెల్యేగా అనిత మారిపోయారు. తాజాగా చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన అనిత.. వచ్చీ రావడంతోనే పవన్ను కెలికేసింది!
గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు పలికి నాలుగేళ్ళ పాలనపై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హఠాత్తుగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఘాటుగానే స్పందించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపైన, మంత్రి లోకేష్పైన పవన్ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అన్న సందేహం ఆయన్ను అభిమానించే ప్రతిఒక్కరిలో నెలకొందని, తనకు వచ్చిన అనుమానాన్ని మొత్తం దేశానికి పులిమేసే ప్రయత్నం చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రాజకీయాల నుంచి రిటైర్ కావాలని పవన్ పేర్కొనడం కూడా సరికాదని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఒడిశా ముఖ్య మంత్రి బిజూపట్నాయక్ల వయసుతో పొలిస్తే చంద్రబాబు చిన్నావారేనని సూత్రీకరించింది.
అంతేకాదు, అభివృద్థి, ప్రజల మద్దతు ఉన్న నేతలకు రాజకీయాల్లో వయసుతో సం బంధం ఉండదన్నారు. నిత్యం జనాల మధ్య ఉండే నాయకుల్ని ప్రజలు ఆదరిస్తారన్నారు. మీటింగ్లకు వచ్చే జనాన్ని చూసి ఓట్లు పడతాయని భావించడం సరికాదని శాపనార్థాలు పెట్టింది. కట్ చేస్తే.. ఇప్పుడు జనసేనాని అభిమానులు సటైర్లు పేలుస్తున్నారు. అమ్మా అనితా .. ఇన్నాళ్లు ఎక్కడికెళ్లావ్? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ బాబుకు జల్లకొట్టి ఏడాది అవుతుంటే.. తగుదునమ్మా అని ఇప్పుడొచ్చి యూటర్న్ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావ్? అని ప్రశ్నిస్తున్నారు ఇక, చంద్రబాబును ట్రంప్ వయసుతో పోల్చడాన్ని కూడా ఆక్షేపిస్తూ.. అంతెందుకు బ్రిటన్ రాజవంశస్థులతో పోలిస్తే.. చచ్చే వరకు పాలించే అవకాశం ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారని, కానీ అనితా మాత్రం పాతచింతకాయ్ పచ్చడిని కెలుకుతున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.